హాట్ టాపిక్ నుంచి అమలు దిశగా సాగుతున్న ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమన్యాయం కోసం పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని ప్రకటించారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లుని చట్టంగా మార్చామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
వాస్తవానికి ఏపీ ప్రజల్లో ఇప్పుడు రాష్ట్ర విభజనతో అయిన గాయాలు మానాలన్నా ఆకాంక్ష ఉంది. అమరావతితో అలాంటి ప్రయత్నం జరిగినపప్పటికీ ఆ నిర్ణయం అందరి అభిప్రాయాలకు అనుగుణంగా లేదన్నది నిజం. ఇప్పుడు మునుపటి గాయాలు లేకుండా జాగ్రత్త పడటం అవసరం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగడం అవసరం. దీనికి వికేంద్రీకరణ సరైనదని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయం ప్రకారమే ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. విశాఖపట్టణంలో రాజధాని అని ప్రకటించినప్పటికీ, అది కేవలం నగరానికో, సమీప ప్రాంతాలకో పరిమితం కాదని సమాచారం. విశాఖ, విజయనగరం జిల్లాలు కలగలుపుగా అభివృద్ధి ఉంటుందని తెలుస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకూ కాన్సెప్ట్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాల్లో పరిశ్రమల ఏర్పాటు, మౌళిక సదుపాయాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దశను మార్చేసేలా ఏపీ సర్కారు కదులుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకు ఉన్న దాదాపు యాభై కిలోమీటర్ల ప్రాంతమంతా వివిధ రకాల ప్రణాళికల ప్రకారం అభివృద్ధి పథంలో నడిపించేలా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోందని సమాచారం.