ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకై ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ‘ధర్మపోరాట దీక్ష’కు బిజెపియేతర పక్షాల నుండి సంపూర్ణ సంఘీభావం లభించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేషనల్ కాన్పరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రియన్, సమాజ్వాదీ పార్టీ నేత ములాయింగ్ సింగ్ యాదవ్, ఎన్సిపి నేత శరద్ పవార్, జనత దళ్ నేత శరద్ యాదవ్, డిఎంకె నేత శివ, కాంగ్రేస్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , శివసేన ఎంపి సంజీవ్ రౌత్, మాజి ప్రధాని దేవగౌడ తదితర నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని నేతలు ఆరోపించారు. ఆంధ్రరాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనీ, కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుందంటూ నేతలు దుయ్యబట్టారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అందరం సహకరిస్తారమని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు చేపట్టిన దీక్షకు టిఎంసి తరపున ఆ పార్టీ ఎంపి డెరిక్ ఒబ్రియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోది నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమయ్యిందని ఒబ్రియన్ అన్నారు. మోది, అమిత్షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోది నిర్వీర్యం చేస్తున్నారని ఒబ్రియన్ దుయ్యబట్టారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామిలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని అన్నారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలు అవుతుందనీ, కేంద్రం ధర్మం తప్పడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడికి వచ్చారని అబ్దుల్లా అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తూ చంద్రబాబు మంచి పని చేస్తున్నారని అబ్దుల్లా కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ఎంత ఇచ్చారో, ఇచ్చిన హామిలు ఏమయ్యాయో చెప్పకుండా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన (మోది) దిగజారుడుదనాన్ని తెలియజేస్తున్నాయని అబ్దుల్లా అన్నారు. ఈ పోరాటన్ని ఇంకా ఉదృతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
సీనియర్ జెడియు మాజీ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేర్చే వరకూ అండగా ఉంటామని చంద్రబాబుకు శరద్ యాదవ్ భరోసా ఇచ్చారు.
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ఏ కార్యక్రమం తీసుకున్నా సమాజ్వాదీ పార్టీ ఆయన వెంట నడుస్తుందని అన్నారు.
ఎన్సిపి నేత శరద్ పవార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను విడుదల చేసి వెనక్కు తీసుకోవడం దుర్మార్ఘమయిన చర్య అని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో ప్రధాని మోదిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదిని మించిన వారు లేరని కేజ్రీవాల్ అన్నారు. హక్కుల కోసం పోరాడితే సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. యావత్ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని మోది మరిచిపోయినట్లు ఉన్నారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
బిజెపి ఎంపి శత్రుఘ్నసిన్హా, శివసేన ఎంపి సంజీవ్ రౌత్లు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.