కేంద్రంలోని మోడీ సర్కార్ పై విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలోని తన స్నేహితులతో ఫోన్ మాట్లాడిన తరువాత తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మార్గరేట్ అల్వా ట్వీట్లు చేశారు. ఈ కొత్త ఇండియాలో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నేతలతో మాట్లాడాలంటే భయపడుతున్నారని అన్నారు.
“బిగ్ బ్రదర్” కు అన్నీ తెలుస్తాయన్న భయం వారిలో కలుగుతోందని అందుకే రెండు, మూడు ఫోన్ లు వాడుతూ ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మారుస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా కలిసినప్పుడు కూడా గుసగుసలాడుకుంటూనే మాట్లాడుకుంటారనీ, భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందని అన్నారు. ఈ ట్వీట్ కు ఎంటీఎన్ఎల్ సంస్థ కేవైసీ సస్పెండ్ చేస్తున్నామనీ, మరో 24 గంటల్లో సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని పంపిన నోటీసు ఫోటోను షేర్ చేశారు మార్గరేట్ అల్వా. అయితే ఇవి నకిలీ నోటీసులు అంటూ ఢిల్లీ పోలీసులు అంతకుముందే హెచ్చరించారు. ఎంపీఎన్ఎల్ పేరు, లోగోను దుర్వినియోగం చేసి వాట్సాప్ లో ఈ తరహా ఫ్రాడ్ మెసేజ్ లు వస్తుంటాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇది కేవైసీ స్కామ్ లో ఒక రకమని పేర్కొన్నారు.
కాగా మార్గరేట్ అల్వా ఆరోపణలను కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి ఖండించారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్ధి గెలుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఆల్వా చేసిన ఆరోపణల్లో అర్ధంలేదని అన్నారు. ఓ సీనియర్ నాయకురై ఉండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని జోషి హితవు పలికారు.