నెల్లూరు జిల్లాలో సొంత కూతురు చేసిన పని చూసి తల్లిదండ్రులే అవాక్కయ్యారు. చావు నుండి కొద్దిలో తప్పించుకున్న వారు తమ కన్న కూతురి స్థితిని చూసి చలించిపోయారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పరిధిలో రాయపుపాలెం లో జేమ్స్ పాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు కానీ పెళ్ళైన దగ్గర నుండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. భార్య భర్తల మధ్య తలెత్తిన సమస్య తోనే ఆమె పుట్టింట్లోనే ఉంటుండగా ఆ సమస్య ఆమెని ఎంతలా వేధించేదో చివరికి ఆమె చేసిన పని వల్ల ఆమె తల్లిదండ్రులకు తెలిసొచ్చింది.
వివరాల్లోకి వెళితే రోజు లాగానే అందరు ఇంట్లో నిద్రిస్తుండగా నిద్రలో పాల్ పెద్ద కుమార్తె తన తల్లిదండ్రుల పై వేడి నీళ్ళు మరియు నూనెను పోసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారి ఒళ్ళంతా కాలిపోయింది. వెంటనే పాల్, అతని భార్య ప్రాణ భయంతో అరుచుకుంటూ బయటకు పరుగు తీశారు.
కుమార్తె మాత్రం వారిపై కారం కూడా చల్లాలని ప్రయత్నించి వారిని వెంబడించింది. పాల్ దంపతుల కేకలతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. కూతురు ఇలా ఎందుకు ప్రవర్తించిందో మాత్రం వారు చెప్పలేకపోతున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.