(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు (58) నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం శోభారాణి ఇంటిలో జారి పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. అప్పటి నుండి శోభానాయుడు ఎముకలు, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమయంలోనే ఆమెకు ఇటీవల కరోనా సోకింది. పది రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్య ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే బుధవారం వేకువజామున ఆమె కన్నుమూశారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.
విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన శోభానాయుడు 1956లో జన్మించారు. చిన్నతనం నుండే నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలు పెట్టిన శోభానాయుడు సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించారు. హైదరాబాద్ లోని కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ప్రిన్సిపాల్ గా పని చేస్తూ ఎంతో మంది శిష్యులను నృత్య కళాకారిణిలుగా తీర్చిదిద్దారు. ఆమె శిష్యుల్లో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు.
శోభానాయుడు బహుముఖ ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శోభానాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.