(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శనివారం సాయంత్రం భారత హైకమిషన్ ఇచ్చిన ఇప్తార్ విందుకు అతిధులు రాకుండా పాక్ అధికారులు దౌర్జన్యం చేశారు. భారత దౌత్యాధికారులు ఇఫ్తార్ విందు నిర్వహించిన హోటల్ సెరెనా ముందు కొందరు పాక్ అధికారులు కాపు కాశారు. విందుకు వచ్చిన అతిధులను భయపెట్టి వెనక్కుపంపారని ఎఎన్ఐ వార్తాసంస్థ తెలిపినట్లు ఎన్డిటివి రిపోర్టు చేసింది.
ఇఫ్తార్ విందు నుంచి బలవంతంగా వెనక్కువెళ్లాల్సి వచ్చిన అతిధులకు భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణలు చెబుతూ, ఇలాంటి భయపెట్టే పద్ధతులు నిరాశ కలిగిస్తున్నాయనీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇవి తోడ్పడవనీ వ్యాఖ్యానించారు. ఇలాంటి పద్ధతులు దౌత్య సంప్రదాయాలకు, సభ్య వర్తనకూ విరుద్ధమనీ, వీటి వల్ల రెండు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బ తింటాయనీ ఆయన పేర్కొన్నారు.
గత నెలలో లాహోర్ సమీపంలోని సచ్చా సౌదా గురుద్వారా దర్శనానికి వెళ్లిన భారతీయలు అవసరాలు చూసేందుకు అక్కడికి వెళ్లిన ఇద్దరు భారత దౌత్యాధికారులను పాక్ అధికారులు 20 నిముషాల సేపు ఒక గదిలో బంధించి ఉంచారు. మళ్లీ ఈ ప్రాంతంలో కనబడ్డారో జాగ్రత్త అని హెచ్చరించి విడిచిపెట్టారు.