కరాచీ: పాకిస్థాన్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్లోని ఒక మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధ్రువీకరించారు. విమాన ప్రమాదం గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమని చెప్పారు. విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్లో శిక్షణ పొందినవారేనని చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.
లాహోర్ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 98 మంది ఉన్నట్టు సమాచారం. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం జనావాసాల మధ్య కుప్పకూలడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఒక నిమిషం వ్యవధిలో విమానం ల్యాండింగ్ కావాల్సి ఉన్న సమయంలోనే ఈ విషాద సంఘటన చోటు చేసుకున్నది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న వారిలో దాదాపు 25 నుంచి 30 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తీసుకెళ్లారని వివరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది మృతిచెందారనే విషయాన్ని మాత్రం ఇప్పట్లోనే చెప్పలేమని చెప్పారు.