Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విపక్షాలకు షాక్ ఇస్తూ పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని సభాపతి తిరస్కరించిన అనంతరం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిపార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్ పిలుపు నిచ్చారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు అరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.
Imran Khan: విపక్షాల అవిశ్వాస తీర్మానం తిరస్కరణ
తొలుత పాకిస్థాన్ పార్లమెంట్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. అయితే తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు వెల్లడించాయి. వంద మందికి పైగా సభ్యులు విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే పాక్ పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ) డిప్యూటి స్పీకర్ ఖాసిం సూద్ విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్దంగా ఉందని పేర్కొన్నారు. సభను వాయిదా వేశారు.
Imran Khan: పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు
పార్లమెంట్ రద్దు చేసినట్లు ప్రకటించిన తరువాత ఇమ్రాన్ ఖాన్ … దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా చట్ట సభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్ పై జరిగిన విదేశీ కుట్రగా అభివర్ణించారు ఇమ్రాన్ ఖాన్. కాగా అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు అనుమతించకుండా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్ధారీ. విపక్షపార్టీలు పార్లమెంట్ ను వీడేది లేదని అన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.