(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి దౌత్యమర్యాదలు అతిక్రమించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్లో జరుగుతున్న షాంగై సహకార సమాఖ్య శిఖరాగ్ర సమావేశంలో అందరూ నిలుచుని ఉండగా ఆయన ఒక్కరే కుర్చున్నారు. ఈ వీడియోను ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
గురువారం నాటి సమావేశానికి దేశాధినేతలు ఒక్కొక్కరే వస్తుండగా మర్యాదగా అందరూ లేచి నిలబడిఉండగా ఇమ్రాన్ ఖాన్ సరాసరి వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. తన పేరు వినబడినపుడు ఒక్క క్షణం లేచి మళ్లీ కూర్చున్నారు. అందరూ నిలబడిఉన్నారన్న సంగతి గమనించి కూడా ఆయన చిద్విలాసంగా కూర్చున్నారు. భారత ఫ్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఇస్లామిక్ సహకార సమాఖ్య హాజరయిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సౌదీ రాజు సల్మాన్ అబ్దుల్ అజీజ్ను కలిశారు. సౌదీ రాజుతో తాను చెప్పాలనుకున్న మాట ఆయన పక్కన నుంచుని ఉన్న దూబాసీకి చెప్పిన ఇమ్రాన్, దుబాసీ తిరిగి ఆ మాట రాజుకు చెప్పేవరకూ ఆగకుండానే అక్కడనుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు.