భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ఫిల్మ్ ఫెస్టివల్లో పాకిస్థాన్ పాల్గొనడం లేదని సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎస్సీఓ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 27వ తేదీ నుంచి జనవరి 30 వరకు నిర్వహించబడతాయని ఐ&బీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముంబై వేదికగా నారిమన్ పాయింట్లోని ఎన్సీపీఏలోని బాబా థియేటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ఎస్సీఓ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకతలు
ఎస్సీఓ ఫిల్మ్ ఫెస్టివల్కు ముంబై వేదిక కానుంది. ప్రపంచ దేశాల నుంచి మొత్తంగా 57 చిత్రాలు ప్రదర్శించబడతాయి. పోటీ విభాగంలో 14 సినిమాలు, పోటీయేతర విభాగంలో 43 చిత్రాలను ప్రదర్శిస్తారు. మొత్తం 14 చిత్రాలను నామినేట్ చేస్తారు. ఈ పోటీలో 5 భారతీయ క్లాసిక్ సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమాలతోపాటు స్పీచ్ సెషన్స్, ఫోటో-పోస్టర్ ఎగ్జిబిషన్, హస్తకళల స్టాల్స్ తదితర ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
నామినేట్ అయిన సినిమాలు
నిఖిల్ మహారాజ్ దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘గోదావరి’, పాన్ నలిన్ దర్శకత్వం వహించిన గుజరాతీ చిత్రం ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ సినిమాలు భారతదేశం తరఫున నామినేట్ అయ్యాయి. అలాగే ఏ జైరో ఎం మమ్మేర్బెకో దర్శకత్వం వహించిన రష్యన్ మూవీ ‘Mom, I’m Alive!’, బైరాకిమోవ్ అల్దియార్ దర్శకత్వం వహించిన కజకిస్తాన్ మూవీ ‘పారాలింపియన్’ బకిత్ ముకుల్ దర్శకత్వం వహించిన కిర్గిజ్ మూవీ ‘అకిర్కీ కోచ్ (ది రోడ్ టు ఈడెన్), దస్తాన్ జాఫర్ఉలూ-తలైబెక్ కుల్మెందీవ్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్సటిలాట్ (హోమ్ ఫర్ సేల్), ఇహుయ్ షావో రూపొందించిన చైనీస్ చిత్రం ‘బీ ఫర్ బిజీ’, బియోజీ రావ్ దర్శకత్వంలో వచ్చిన చైనీస్ మూవీ ‘హోమ్ కమింగ్ చైనా’ సినిమాలు నామినేట్ చేయబడ్డాయి.
ఈ సందర్భంగా ఐ&బీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మాట్లాడుతూ.. ‘ఎస్సీఓ ఫిల్మ్ ఫెస్టివల్కు భారత్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. విదేశీ సంస్కృతులను పరిచయం చేయడంలో ఎస్సీఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆయా దేశాల సినిమాలను ప్రదర్శించడంతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలుగుతుందన్నారు. ఈ ఫెస్టివల్లో అన్ని దేశాల సినిమాలు పోటీ చేస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం పాల్గొనదు. ఇప్పటికే ఫెస్టివల్కు సంబంధించిన ఏర్పాటు పూర్తయ్యాయి.’ అని పేర్కొన్నారు.