తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా టిడిపి వికెట్ మరొకటి పడిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిపోయారని సమాచారం.
ఫక్తు కాంగ్రెస్ వాది అయిన పనబాక లక్ష్మి పలు పర్యాయాలు నెల్లూరు,బాపట్ల ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ కి డైరెక్ట్ యాక్సిస్ ఉన్న నాయకురాలిగా పనబాక లక్ష్మి పేరు తెచ్చుకున్నారు. అయితే 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరూ కాంగ్రెస్ ను వీడి పోగా పనబాక లక్ష్మి కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త ,దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ పీఆర్వో కృష్ణయ్య కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి ఎస్సీ లోక్సభ నియోజకవర్గం నుండి పనబాక లక్ష్మిని,’గూడూరు అసెంబ్లీ నుండి ఆమె భర్త కృష్ణయ్యను టిడిపి నిలిపింది. అయితే జగన్ ప్రభంజనం లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం పనబాక దంపతులు సైలెంట్గా ఉండిపోయారు.
అయినప్పటికీ తాజాగా టిడిపి రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించినప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉన్న తనకు అవకాశం వస్తుందని పనబాక లక్ష్మి ఎదురుచూశారు. అయితే చంద్రబాబు..పార్టీలో క్రియాశీలంగా లేని పనబాక దంపతులను పక్కన పెట్టారు. ఇది పనబాక లక్ష్మికి అసంతృప్తి కలిగించింది. ఇదే సమయంలో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించడంతో త్వరలో ఉప ఎన్నిక కూడా జరగనున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు తనకు తిరుపతి టికెట్ ఇచ్చే అవకాశం లేదని పనబాక లక్ష్మి గ్రహించారు. దీంతో ఆమె బీజేపీ వైపు దృష్టి సారించారని సమాచారం. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన సహచరురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున ఆమె ద్వారా కమలనాథుల క్యాంపులో అడుగుపెట్టాలని పనబాక లక్ష్మి పావులు కదుపుతున్నారట.
తిరుపతి లోక్సభ సీటు ఇస్తే వెంటనే పార్టీలోకి వస్తానని ఆమె బీజేపీ రాష్ట్ర నాయకులకి సమాచారం కూడా పంపారట. పనబాక లక్ష్మి బీజేపీ లోకి వెళ్ళడానికి ఒక ఇంకో కారణం కూడా ఏమిటంటే తిరుపతి లో ఆ పార్టీకి గట్టి పునాది ఉంది. 1999లో తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించడం జరిగింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జయరామ్ కేవలం 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గెలుపోటములు పక్కన పెడితే బీజేపీ కేంద్రంలో అత్యంత బలంగా ఉన్నందున తనకు ఆ పార్టీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, టిడిపి పని అయిపోయినందున ఇక అందులో ఉండటం అవసరమని పనబాక లక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చారని, ఇవాళో రేపో ఆమె బాంబు పేలుస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే టిడిపి మళ్లీ తిరుపతి కోసం కొత్త అభ్యర్థిని వెతుక్కోక తప్పదు .లేకపోతే పాతకాపు వర్ల రామయ్య ని తిరుపతి దారి పట్టిస్తారు.