Panchayat Polls : రాష్ట్రంలో చివరి దశ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీీపీ మద్దతుదారుల హవానే కనబడింది. ఓ పక్క వైసీపీ, మరో పక్క టీడీపీ ఎవరి లెక్కలు వారు చెప్పుకున్నా వైసీీపీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలు కైవశం చేసుకున్నారు. ఇంతకు ముందు జరిగిన మూడు దశల ఎన్నికల్లోనూ వైసీీపీ మద్దతుదారులు అధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. అధిక పంచాయతీలు కైవశం చేసుకున్న ఆనందంతో వైసీీపీ, అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చి విజయాలు చవిచూశామని టీడీపీ విజయోత్సవాలను నిర్వహించుకున్నాయి. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ, మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకోగా, తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలుచున్నామని జనసేన పలు సంబరాలు చేసుకున్నాయి. అయితే పలు జిల్లాల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు వారి స్వగ్రామాల్లో పరాజయం తప్పలేదు.
Panchayat Polls : టీడీపీ మాజీ మంత్రి బండారుకు షాక్
విశాఖపట్నం జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఆ పార్టీ నాయకులు భారీ షాక్ ఇచ్చారు. బండారు స్వగ్రామం వెన్నెలపాలెంలో గత 40 సంవత్సరాల నుండి ఆ గ్రామంలో బండారు హవానే కొనసాగుతుండగా ఈ సారి ఆయన సతీమణి వాణి సర్పంచ్ గా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఈ గ్రామంలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి అప్పారావు 663 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీలో టీడీపీ బలపర్చిన అరుణాదేవి విజయం సాధించారు. అదే విధంగా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్వగ్రామం రాయుడుపాలెంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఎమ్మెల్సీ రేసులో ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ స్వగ్రామం తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు.
వైసీీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్వగ్రామం పెదకాకాని మేజర్ పంచాయతీలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి 72 ఓట్లతో గెలుపొందారు. జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి మద్దతుగా మారిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజోలు నియోజకవర్గంలో 20కి పైగా గ్రామాల్లో జనసేన బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోనూ వైసీపీ బలపర్చిన అభ్యర్థులే ఎక్కువ గ్రామాల్లో విజయం సాధించడం విశేషం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె కందులవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా ఈ గ్రామంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులను ఓడించి చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైసీపీ నేతల వ్యూహాలు ఫలించలేదు. ఈ గ్రామంలోని మొత్తం వార్డులు, సర్పంచ్ టీడీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించి చంద్రబాబు పరువు నిలబెట్టారు. ఈ గ్రామంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ జిల్లా కడప లో నాల్గవ విడత జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పోలింగ్ జరిగిన అన్ని గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మాత్రం వైసీపీ బలపర్చిన అభ్యర్థులే ఎక్కువ స్థానాలు కైవశం చేసుకోవడం విశేషం.