కడప, మార్చి 18: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు అనుమానితుడుగా భావిస్తున్న కె పరమేశ్వరరెడ్డి పేర్కొన్నాడు. వివేకా ఆధిపత్యం ఇష్టపడని వారు ఈ పని చేసి ఉంటారని పరమేశ్వరరెడ్డి అన్నాడు.
సిట్ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పని మనిషి లక్ష్మి, డ్రైవర్ ప్రసాద్, పనిమనిషి కుమారుడు అశోక్, వివేకా పిఎ కృష్ణారెడ్డిలతో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
తొలుత రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవించి, జైలు నుండి విడుదల అయిన రాగిపిండి సుధాకర్ ఈ హత్య చేసి ఉంటాడని బావించి అతన్ని పోలీసులు విచారించారు. తాను హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నానని, జైలు నుండి వచ్చిన తరువాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని పోలీసు అధికారులకు సుధాకర్ తెలియజేశాడు. ఏర్ర గంగిరెడ్డిని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయగా వివేకా హత్య జరిగినప్పటి నుండి అయనకు సన్నిహితంగా ఉండే కె పరమేశ్వరరెడ్డి కనిపించకుండా పోయాడని తెలుసుకున్నారు.
పరమేశ్వరరెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా అతను తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నారు. పరమేశ్వరరెడ్డిపై గతంలో పలు హత్య నేరాలు కూడా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంలో పరమేశ్వరరెడ్డి పలు సంచన విషయాలను వెల్లడించారు. తనకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని పరమేశ్వరరెడ్డి వెల్లడిస్తూ, ఇంటి దొంగల సహకారం లేకుండా ఈ హత్య జరిగి ఉండేదికాదన్నాడు. ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఈ పని చేసి ఉంటారని అన్నాడు. వైసిపి అధికారంలో రాగానే తానను మంత్రిగా తీసుకోబోతున్నాడని ఒకరిద్దరి వద్ద వివేకానంద రెడ్డి అన్నారనీ, దాంతో ఆయన ఆధిపత్యాన్ని ఇష్టపడని వారు ఈ పని చేసి ఉంటారని పరమేశ్వరరెడ్డి అన్నాడు.
వైఎస్ కుటుంబం కోసం తాను ప్రాణం ఇచ్చే వాడినే కానీ వారి ప్రాణం తీసేవాడిని కాదని అన్నాడు. తనకు అరోగ్యం బాగోలేక కడప ఆసుపత్రిలో చేరగా మూడు రోజుల పాటు వ్యక్తిగత పనులపై డాక్టర్ వేరే ఊరికి వెళ్లడం వల్ల ఆయన సూచనల మేరకు తాను తిరుపతికి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతున్నానని చెప్పాడు. డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడని, అతన్ని అనుమానించాల్సిన అవసరం లేదని అన్నాడు. వివేకానందరెడ్డి కొన ఊపిరితో ఉన్నప్పుడే హత్య చేసినవారు బలవంతంగా డ్రైవర్పై నేరం నెట్టివేయడం కోసం ఆ లేఖ రాయించి ఉంటారని పరమేశ్వరరెడ్డి అన్నాడు.