దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ 5.0ని సడలిస్తూ కేంద్రం దశల వారీగా అనేక కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూలై నుంచి స్కూళ్లను కూడా తెరవాలని చూస్తున్నారు. అందుకు గాను ఇప్పటికే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ షెడ్యూల్ సిద్ధం చేస్తోంది అయితే స్కూళ్లను ఓపెన్ చేసినా తమ పిల్లలను పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా భయం వారిని వెంటాడుతోంది.
హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) తాజాగా విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేయగా ఎనభై రెండు శాతం మంది తల్లిదండ్రులు స్కూళ్లు పున ప్రారంభించినా తమ పిల్లలను పంపబోమని తేల్చి చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గేవరకు లేదా దానికి వ్యాక్సిన్ వచ్చే వరకు తమ పిల్లలను స్కూళ్లకు పంపేది లేదని వారు ఆ సర్వేలో స్పష్టం చేశారు.
2020-21 విద్యాసంవత్సరానికి గాను స్కూళ్లు ఎలాంటి ఫీజునూ పెంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన జీవో నం.46ను అరవై శాతం స్కూల్ యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయని.. తల్లిదండ్రులు ఈ సర్వేలో చెప్పారు. సదరు జీవో ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాలను పాటించని స్కూళ్ల గుర్తింపును రద్దు చేసి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు స్కూళ్ల భవితవ్యం ఏమిటో అర్థం కావడం లేదు.వాటిని ఓపెన్ చేస్తారా ? చేస్తే ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ? తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు ఎలాంటి భయం లేకుండా పంపుతారా ? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరిస్థితిలో ఎవరూ లేరు.
previous post