Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ కానున్నాయి. ఈ విడత సమావేశాల్లో పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్ధులు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
Parliament Budget Session: కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీ
ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జన్ ఫథ్ లో పార్టీ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశమైంది. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జన్ ఖర్గే, ఆనంద శర్మ, కే సురేశ్, జైరామ్ రమేశ్ పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు నేతలు పేర్కొన్నారు. మరో పక్క బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. లోక్ సభలో షెడ్యుల్ తెగల కు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ ను సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవశం చేసుకున్న జోష్ లో ఉన్న బీజేపీ.. నూతన ఉత్సాహంతో సమావేశాలకు రానుంది. విపక్షాల ఎత్తుగడలను ధీటుగా తిప్పికొట్టేందుకు అధికారపక్షం సిద్ధం అవుతోంది.
Read More: Ukraine Russia War: రష్యా బంపర్ ఆఫర్ .. డైలమాలో మోడీ..! మేటర్ ఏమిటంటే..?
ఏప్రిల్ 8వ తేదీ వరకూ
పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 11వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రేపు ప్రారంభం అవుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకూ కొనసాగుతాయి.