కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల రద్దునకు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలతను వ్యక్తం చేశాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇక ఒకే సారి జనవరి నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున రైతాంగం నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దీనిపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. దీంతో జోషి లేఖ ద్వారా తాజా నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. తాను అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపాననీ, వారంతా సమావేశాల రద్దుకే మొగ్గు చూపారని జోషి పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఒక్కసారి అయినా పార్లమెంట్ సమావేశం కావాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ బడ్జెట్ ప్రకటనకు ముందు జనవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది.సెప్టెంబర్ నెలలో వర్షాకాల సమావేశాల సందర్భంలో పలువురు ఎంపీలు కరోనా బారినపడటంతో సమావేశాల సమయాన్ని కుదించిన విషయం తెలిసిందే. పెద్ద వయస్సు ఉన్న వారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న మొత్తం 785 సభ్యుల్లో దాదాపు 200 మంది 65 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. ఈ కారణంగా వివిధ రాజకీయ పక్షాల నేతల అభిప్రాయాలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్రం రద్దు చేసింది.