ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నుండి రాష్టంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకొక్క జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మొదటి సారి టీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ జిల్లాల పెంపునకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఏపీ లోనూ జగన్ ప్రభుత్వం జిల్లాల పెంపునకు చర్యలు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇపుడు తెలుసుకుందాం…..
అధికారం మీద అవగాహన ఉన్న అందరూ ఆంధ్రాలో జిల్లాలు చాలా పెద్దవనీ, వాటిని విభజించాలనీ చెబుతారు. కానీ ఎక్కువ మంది మాత్రం ప్రస్తుత ప్రతిపాదనలో చెబుతున్నట్టుగా పార్లమెంటు నియోజకవర్గాలను యధాతథంగా జిల్లాలను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల విభజనకు తీసుకునే ప్రాతిపదిక, జిల్లా పరిపాలనకు అవసరమయ్యే ప్రాతిపదిక ఒకేలా ఉండవు. పైగా దూరాలు మరొక సమస్య.
తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అరకు పార్లమెంటు పరిధిలో ఉంది. అరకు ఊరు నుంచి రంపచోడవరం 250కిమీ ఉంది. అది కూడా మామూలు రోడ్డు. హైవే అయితే 280కిమీ పైనే పడుతుంది. ఇక పాలకొండ నుంచి అరకు ప్రయాణం పూట కంటే ఎక్కువ పడుతుంది. వారికి శ్రీకాకుళం పక్కనే ఉంటుంది. ఇప్పుడు అరకు యధాతథంగా జిల్లా అయితే రంప చోడవరం ప్రజలకు అరకు కంటే విజయవాడ, విశాఖపట్నం దగ్గరగా ఉంటాయి.
మరో పక్క భావోద్వేగాల సమస్య. ఉదాహరణకు మండపేట నియోజకవర్గం అమలాపురంలోకి వస్తుంది. వాటి మధ్య 50 కిమీ దూరం. కానీ వారికి రాజమండ్రి 25 కిమీ దూరంలోనే ఉంటుంది. అక్కడి వారు అమలాపురం కాకుండా రాజమండ్రి వెళ్లడానికి అలవాటు పడ్డారు. సంతనూతలపాడుకు ఒంగోలు 10 కిమీ ఉంటుంది. కానీ పార్లమెంట్ నియోజక వర్గాల ప్రకారం జిల్లాలను విభజిస్తే వారు 80 కిమీ దూరంలో బాపట్ల జిల్లాకు వెళ్లాల్సివస్తుంది. తిరుపతి నుంచి సర్వేపల్లి 120 కిమీ. నెల్లూరు నుంచి 25 కిలో మీటర్ల దూరం ఉంటుంది. కానీ వారు తిరుపతి జిల్లాకు వెళ్తారు. తిరుపతి పక్కనే ఆనుకుని ఉన్న మంగళం, చంద్రగిరి వంటివి చిత్తూరు జిల్లాలోకి వెళ్తాయి. రాజంపేటకు పుంగనూరు, మదనపల్లె పట్టణాలు 150 కిమీ దూరం వరకూ ఉంటాయి. కడప, రాజంపేట మాత్రం 50 కిమీ దూరంలో పక్కపక్కనే ఉంటాయి.
విజయవాడ పక్కనే గన్నవరం ఉంటుంది. గన్నవరంలోని విమానాశ్రయాన్ని కూడా విజయవాడ విమానాశ్రయం అంటారు. అదే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లా ఏర్పడితే గన్నవరం మచిలీపట్నం జిల్లాలోకి వెళుతుంది. అంటే, దగ్గరగా ఉన్న విజయవాడ కాకుండా గన్నవరం వాసులు దూరంగా ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సి వస్తుంది.
ప్రకాశం జిల్లాలో వైవిధ్యం చాలా ఎక్కువ. సముద్రతీరం, సీమ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం..అన్నీ కలసి ఉంటాయి. కర్నూలుకూ, ఒంగోలుకూ మధ్యలో కడపకు ఉత్తరంగా ఉన్న మార్కాపురం, గిద్దలూరు వంటి ప్రాంతాల వారు భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో ప్రత్యేక జిల్లాగా ఉండాలని కోరుకుంటారు. తూర్పు rrraగోదావరిలోని అమలాపురం సఖినేటిపల్లి మధ్య ప్రాంతాలు కోనసీమగా ప్రత్యేక జిల్లాగా చాలా కాలం నుంచి కోరుతూ వచ్చారు. మచిలీపట్నం, చిత్తూరు వంటి పట్టణాలు పేరుకు జిల్లా కేంద్రాలుగా ఉన్నా, వాటి స్థానంలో విజయవాడ, తిరుపతి నగరాల్లోనే పాలన జరుగుతూ వస్తున్నది. దీంతో పార్లమెంటు స్థానం యథాతథంగా కాకుండా ఆయా ప్రాంతాల సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ వస్తున్నది.
లోక్ సభ నియోజకవర్గానికి ప్రధాన కార్యాలయం ఉండదు. అదసలు పాలనా కేంద్రమే కాదు. పేరు కోసం మాత్రమే. దానికీ ప్రజలకూ సంబంధం లేదు. పార్లమెంటు నియోజకవర్గాలు శాశ్వతం కాదు. 2026లో మళ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటి వస్తుంది. వారు మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను తారుమారు చేసినా ఆశ్చర్యం లేదు. కానీ జిల్లా అలా కాదు. ఒకసారి ఏర్పాటు చేస్తే, ఇక మళ్లీ మార్చలేరు.
తిరుపతి పక్కన ఉండే వారిని చిత్తూరు వెళ్లమనడం సమంజసం కాదు. తిరుపతి జిల్లాలో నాలుగు కోస్తా నియోజకవర్గాలు వస్తాయి. గుంటూరులో బాపట్ల, తెనాలి జిల్లాలవుతాయి. బాపట్ల, తెనాలి మధ్య దూరం అరగంట. కానీ వాటి పరిధిలోని ప్రాంతాలు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. ఇలాగే విభజిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదని పేర్కొంటున్నారు. రైల్వే కోడూరు కడప కంటే తిరుపతికి దగ్గర. జిల్లాల విభజనకు ఒక కమిటి వేసి ప్రజాభిప్రాయం తీసుకుని ఎవరికీ ఎటువంటి సమస్య రాకుండా శాస్త్రీయంగా విభజన జరపాల్సిన అవసరం ఉంది.