CP Sajjannar: బోధన్ పాస్ పోర్ట్ కేసులో పోలీసులకి మరో షాక్ తగిలింది. ఈ కేసులో రోజురోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జన్నార్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ కేసుకి సంబంధించిన వివరాలను బయటపెట్టారు. కొందరు తెలంగాణ పోలీసు అధికారులు బంగ్లాదేశీయులకు తప్పుడు పత్రాలతో ఒకే అడ్రస్ పై ఏకంగా 32 పాస్పోర్ట్ లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కమీషనర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో భాగంగా 8 మందిని అరెస్ట్ చేశారట. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారట. అంతేకాకుండా ఆ ఎనిమిదిమందిలో నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్ కు చెందిన వ్యక్తి మరియు ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఉన్నారట.
ఇక ఒకే అడ్రస్ మీద ఏకంగా 32 పాస్పోర్టులు జారీ అవడం డిపార్ట్మెంట్ లో కలకలం రేపింది. ఇలా ఒకే అడ్రస్ పై 32 పాస్పోర్ట్ లు జారీ అవ్వడంతో ఇమ్మిగ్రేషన్ రీజనల్ పాస్పోర్టు అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ చెప్పారు. దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలోనే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలియజేసారు.
కేవలం పోలీస్ అధికారుల అవినీతి మరియు నిర్లక్ష్యం కారణంగానే ఇలా 32 పాస్ పోర్టులు జారీ అయినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొందరు వ్యక్తులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారి పాస్పోర్ట్ లను చూసి సందేహం కలిగి ఆరా తీస్తే ఈ ఉదంతం బయటపడిందని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్నారన్న విషయం పై విచారణ జరుపుతున్నాం అని స్పష్టం చేశారు.