సుదీర్ఘ విరామం అనంతరం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. వచ్చీరాగానే జనసేనాని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో ఉన్న పార్టీ పై ధ్వజమెత్తుతారు. కానీ కె.ఎ.పాల్ అంతా వెరైటీ కదా! కొద్దిగా తేడా కూడా!! బాగా ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే తనకు కూడా మీడియాలో హైపు వస్తుంది అనుకున్నాడో ఏమో జనసేనాని పై విపరీతంగా దుమ్మెత్తిపోశారు. ఇదే పాల్ గతంలో తాను పవన్ కళ్యాణ్ కలిస్తే 2019 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలను స్వీపు చేయగలమని గడపటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఏమైందో ఏమో గాని పవన్ కళ్యాణ్ పై పాల్ నోరు పారేసుకున్నారు.పవన్ జీవితంలో సీఎం కాలేరని – ఆయన డ్యాన్స్ లు వేసుకోవడానికి సినిమాల్లోకి వెళ్లడమే మంచిదని ఎద్దేవా చేశారు.
ఇక ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు కనీసం రెండు శాతం పడలేదన్నారు. పవన్ కు నీతి నిజాయితీలు లేవని, కట్టుబాట్లు లేవని ,అందుకే పెద్ద పెద్దవాళ్లు ఆయన పార్టీని విడిచి వెళ్తున్నారని ఆయన సెలవిచ్చారు. ఎమ్మెల్యే కూడా కాలేకపోయారని ఎగతాళి చేశారు.ఏడాదికో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు.ఇక ఎమ్మెల్యే అయితే ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. .పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవమని – తనకు తమ్ముడిలాంటివాడు అంటూనే తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీజేపీ యూజ్ అండ్ త్రో పార్టీ అని తెలిసినప్పటికీ వారితో వెళ్తున్నారు కాబట్టి పవన్ ఇక ఎదిగేది ఏమీ ఉండదన్నారు.
2014లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చారని – 2019లో వారికి దూరమై బీఎస్పీని – కమ్యూనిస్టులతో కలిసి తిరిగారని గుర్తు చేశారు. ఇప్పుడు కమ్యూనిస్టులను వదిలేసి అధికార దాహంతో కమలం పార్టీ చెంతకు చేరారని ఆరోపించారు.అందుకే ఆయనను నమ్మవద్దని ఘాటుగా మాట్లాడారు.పవన్ కళ్యాణ్ పై పాల్ వ్యాఖ్యలతో వెర్రెత్తి పోయిన జనసేన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కె.ఎ.పాల్ కి కావాల్సిన పబ్లిసిటీ వచ్చినట్టే!