”రైతు కన్నీరు పెడితే ఎక్కడ మంచి జరగదు”
ఈ మాట ప్రతిసారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తూ ఉంటారు.. రైతుల సమస్యలు అనగానే స్పందిస్తారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికీ ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు… ఇంత వరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ సైతం సాధారణ, అవకాశవాద రాజకీయాలు వైపు మళ్లారా? రైతుల పలకరింపు కేవలం రాజకీయాల కోసమేనా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి… ఎందుకు అంటారా ..??
రైతు ఎక్కడైనా రైతే… అతడి బాధ పుడమి వెత.. అతడి వ్యధ మట్టి రొద… మరి ఇంతటి మన రాజకీయ నాయకులకు మాత్రం ఇవేవి పట్టవు. రైతు కోసమే మా పోరాటాలు ఆరాటాలు అని చెప్పుకునే నాయకులూ సైతం ఇంట్లో రైతుల బాధపై కన్నీరు కారుస్తూనే, ఇంటి బయట దీనంగా ఉన్న రైతును చూసి మొహం తిప్పేసుకుంటున్నారు. తానూ రైతునే అని చెప్పుకుంటూ, అప్పుడప్పుడు తన ఫామ్ హౌస్ వేదికగా చేసే వ్యవసాయాన్ని చూపిస్తూ తనకు వ్యవసాయంలో అన్ని తెలుసు అని చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నివర్ తుఫాన్ నష్టం కనిపించిందే తప్ప ….దేశ రాజధాని ఢిల్లీలో 8 రోజులుగా తిండి, తిప్పలు మని లక్షలాది రైతులు తమ కుటుంబాలతో సహా చేస్తున్న రైతు బిల్లు వ్యతిరేక ఉద్యమం ఆయనకు కనిపించలేదు. తిరుపతి లో ఆయన విలేకరుల సమావేశంలో కనీసం అడిగిన ప్రశ్నకు దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీనిపై అసలు సమస్యే లేదన్నట్లు స్పందించారు. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ సమస్య ఉన్న స్పందిస్తామని ప్రశ్నిస్తామని చెప్పి రాజకీయాలు మొదలు పెట్టిన పవన్ వైఖరి లో ఈ మార్పు ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
** బీజేపీ కి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేయడం లేదు. కేవలం ప్రభత్వం తీసుకువచ్చిన బిల్లు మీద పోరాటం చేస్తున్నారు. బిల్లు మీద స్పందించి, దాని మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పి, ఎక్కడైనా రైతులకు జనసేన అండగా ఉంటుంది అని , వారి పోరాటానికి మద్దతు ఇస్తామనో, లేక బిల్లులోని విషయాలపై విశ్లేషణ చేసి రైతులకు మేలు జరిగేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని పవన్ ప్రకటించి ఉంటె జనసేన పార్టీకు మంచి మైలేజ్ వచ్చేది. అవసరం అయితే పవన్ బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించగలడు అన్న సందేశం వెళ్ళేది. ఎక్కడ అన్నదాత కు అన్యాయం జరిగిన జనసేన పోరాడటానికి ముందు ఉంటుంది అనే విషయం ప్రజల్లోకి వెళ్ళేది. మంచి అవకాశాన్ని జనసేనాని మిస్ చేశారనేది విశ్లేషకుల మాట.
**పవన్ రైతుల పోరాటం దాటవేత విషయంలోనే కాదు… బిల్లు రైతులకు మంచి చేస్తున్నది అన్నట్లు కొన్ని అంశాలను మాట్లాడారు. బిల్లు ఏ విషయంలో మంచి చేస్తుంది అనేది స్పష్టం చేయలేదు. ఒకవేళ బిల్లు లో అంత మంచి ఉంటె పంజాబ్ , హరియాణాల నుంచి అంత మంది రైతులు ఎందుకు స్వంచ్ఛందంగా పోరాటానికి ఢిల్లీ వస్తున్నారు..? అనేది పవన్ తెలుసుకోవాలి. ఇదేమి రాజకీయ పోరాటం కాదు… రైతు పోరాటం. ఈ విషయంలో రాజకీయ టర్న్ తీస్కుని పవన్ మాట్లాడితే అతడికే పెను నష్టం. ఎప్పటికి బీజేపీ వెనుక నీడలా ఉండిపోయే ప్రమాదం ఉంది. పంజాబ్ , హరియాణా ప్రాంతాలకు ఈ బిల్లు చేసే ముప్పు అంత అన్నది పవన్ మాట్లాడితే బాగుండేది.
చివరిగా…….
రైతు సమస్యలు దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. దాని మీద అవగాహనా అవసరం. రైతు చేసే ప్రతి ఆందోళన రాజకీయ పరమైంది అనుకునేలా ఆలోచన చేయడం సరి కాదు. దీన్ని జనసేనాని గుర్తు ఎరగాలి. కొత్త రాజకీయాలు చేస్తారని, తప్పు ఎక్కడ జరిగిన ఎవరికీ భయపడకుండా స్పందిస్తారని ఎంతో మంది పవన్ వెనుక నడుస్తున్నారు… అయన వెనుక నడిచే వారిని సైతం గొంతు ఎత్తనివ్వకుండా చేసి, బీజేపీ వెనుక ఉంచడానికి మాత్రమే అయన రాజకీయాలు చేస్తే పార్టీ నుంచే క్రమంగా వ్యతిరేకిత మొదలయ్యే అవకాశం ఉంది.