జనసేనా పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి మరోమారు ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి విభిన్నమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తూ సాగుతున్న జనసేనాని గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన గేమ్ రాజకీయ వ్యూహాలకు తగు రీతిలో లేదంటున్నారు.
తొండంగిలో ఏం జరుగుతోంది?
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మ పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజా క్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్ తో చర్చలు జరిపింది.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ
దివీస్ కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బాధితులను పరామర్శించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వారికి అండగా ఉంటామని అన్నారు. మనోహర్ దివీస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులతో ముఖాముఖిగా కార్యక్రంలో పాల్గొని సమస్యలను అక్కడి వారు ద్వారా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను విన్న మనోహర్ అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడిచి పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పది రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా దివీస్ కంపెని నిర్మాణాన్ని నిలిపివేయకపోతే తమ నాయకులు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుందని , ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోమని నన్ను పంపారని , సమీప గ్రామ ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుంది అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు:
1. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి
2. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.
3. దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్ రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు
4. దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి
5. దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున ‘నైపుణ్య’ సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
6. సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి
ఇలా దివీస్ ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకోవడం , కంపెనీ ముందుకు వచ్చి కీలక ప్రకటన చేసి రెండు రోజులు దాటిపోయిన తరుణంలో జనసేన పార్టీ రంగంలోకి దిగడం, పరిష్కారం చేయకపోతే ఉగ్రరూపం దాల్చుతారని ప్రకటన చేయడం పవన్ రాజకీయ వ్యూహాల్లో లోపాలు బయటపెడుతోందని పలువురు అంటున్నారు.