Pawan Kalyan: దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులపై పలు ప్రదేశాలలో రన్ వేలను నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 13 చోట్ల రన్ వేలను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని బర్మేర్ నందు నిర్మించిన హైవే ఎయిర్ స్ట్రిప్ ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు పరిశీలించారు. అదే మాదిరిగా ఏపిలోని ప్రకాశం జిల్లాలో రెండు ప్రదేశాలలో ఈ అత్యవసర రన్ వేలు నిర్మిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొరిశపాడు – రేణంగివరం వరకు రూ.23.77 కోట్లతో 5 కిమీ పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకే సారి నాలుగు విమానాలు, ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు. కలికివాయి – సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలో మీటర్ల పొడవైన రన్ వే నిర్మిస్తున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్ తో రన్ వే, రెండు వైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్ వేకి 150 మీటర్ల దూరంలో ఏటీసీ టవర్ భవనం నిర్మాణం చేయనునారు. ప్రస్తుతం రన్ వే సంబంధించిన కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రన్ వే లు నిర్మించడం అభినందనీయమన్నారు. దేశ భద్రత పకృతి వైపరీత్యాలు వలల్ తలెత్తే అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలు చేపడుతున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఇప్పటికే రాజస్థాన్ లోని బడ్మేర్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంగా నిలుస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విశిష్ట పథకాన్ని ఏపిలో కూడా అమలు చేస్తున్నందున తెలుగు ప్రజల తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.