Pawan Kalyan Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘హరహర వీరమల్లు’ చిత్రం మొదటి లుక్ ను వీడియో రూపంలో చిత్రబృందం కొద్ది నిమిషాల కిందటే విడుదల చేసింది. ఇక చారిత్రాత్మక నేపథ్యంలో తన కెరీర్లో మొట్టమొదటిసారి ఒక చిత్రం చేసిన పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇటువంటి సినిమాని ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ద్వారా మంచి మార్కులు కొట్టేసిన క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం తో పవన్ అభిమానులు బాగా నమ్మకంతో ఉన్నారు. ఇంతకీ అసలు హరహర వీరమల్లు చరిత్ర ఏమిటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
ప్రాచీన విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఈ హరిహర రాయలు. ఇతనికి ‘హక్క రాయలు’, ‘వీర హరిహరుడు’ అనే పేర్లు ఉన్నాయి. హరిహర, అతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా ఉన్నారు. ఆ తర్వాత తుగ్లక్ 1326 లో కంపిలి ని జయించినప్పుడు బందీలుగా వీరిద్దరూ ఢిల్లీ తరలించబడ్డారు. అక్కడ ఒక పెద్ద గాలి దుమారం వచ్చి సైనికులు బందీలుగా చెల్లాచెదురయ్యారు. కొన్ని అనూహ్య పరిణామాల అనంతరం సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మారారు. ఇక దాని తర్వాత ఏకంగా కంపిలినే స్వాధీనపరుచుకున్నారు.
శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో హిందూ మతాన్ని స్వీకరించిన అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి సుల్తాన్ ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హరిహరరాయలు క్రమంగా మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇదే సమయంలో హొయసల రాజ్యం పతనమైంది. అలా హరిహరుడు తన సుస్థిరమైన పాలన వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు.
1346 కాలంలో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో ’హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు’ అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది. అలా మన తెలుగు వారిని, దక్షిణ భారతదేశానికి ఎన్నో శతాబ్దాలు పాలించి రాజ్యాధికారం వహించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజుగా హరిహరులు ఇప్పటికీ కీర్తింపబడుతున్నాడు. అతని జీవిత చరిత్రనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోషిస్తున్నాడు.