సాధారణంగా కరోనాని ప్రపంచం మొత్తం ఒక సమస్యగా చూస్తుంటే… ఏపీలో మాత్రం అది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి అదొక సమస్య.. కాని మాకు అది ఒక రాజకీయ అస్త్రం అన్నట్లుగానే ప్రతిపక్షాలు సైతం ప్రవర్తిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్ధికంగా కుదేలయినా కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వమే దాన్ని ఒకసాకుగా చూపని సమయంలో… ప్రతిపక్షాలు మాత్రం దాన్ని సాకుగా చూపి పతనమయిపోయాయని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే.. చాలా కాలం తర్వాత చంద్రబాబు – పవన్ లు ఒకేమాటపైకి వచ్చారు.
అవును… కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకూ ఉధృతం అవుతున్న సమయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకం అవుతుందనీ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని, ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ క్షేమదాయకం కాదని బాబూ తెలిపారు. కాగా… అవినీతిపనులు, అక్రమాల చేష్టలు చేసినవారిని అరస్టులు చేస్తుంటే… కరోనాసమయమే దొరికిందా అని బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఇదే విషయంపై చాలా కాలంగా స్థబ్ధగా ఉన్న పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతుండడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని, పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిసా, ఛత్తిస్ గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని పవన్ సూచించారు.
మరి ప్రభుత్వం ఈ విషయంలో అయినా వీరి అభిప్రాయాణలను పరిగణలోకి తీసుకుంటుందా… కరోనాతో ఏమి ఆగాయి… ఇదీ ఆగదు అన్నట్లుగా ముందుకుపోతుందా అనేది వేచి చూడాలి!