Pawan Kalyan : రాష్ట్రంలో జరిగిన పుర పాలక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి, మైదుకూరు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించింది. బీజేపీ, జనసేన కొన్ని చోట్ల వార్డు స్థానాలు గెలుచుకుని ఉనికిని చాటుకున్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని పవన్ అన్నారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ ఓటర్లను బెదిరించారని అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చి వైసీపీ ఓట్లు సాధించలేదని పేర్కొన్నారు. కడుపు మీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించారని పవన్ విమర్శించారు.