జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు-పవన్ కుట్ర పన్నుతున్నారని.. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ప్రజా తీర్పును పవన్ గుర్తెరగాలని.. తన ప్రొడ్యూసర్ చంద్రబాబు ఓడిపోయారనే కోపంతో పవన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని.. చంద్రబాబు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించితే పవన్ ఏనాడైనా ప్రశ్నించారా అని.. ఇసుక విధానంపై పవన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, గతంలో ఇసుక దోపిడీ చేస్తే ఒక్క మాటైనా మాట్లాడలేదెందుకని.. పవన్ పై వైకాపా నేతలు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంపై ఒకమాట కూడా మాట్లాడని పవన్.. నాటి టీడీపీ పనులన్నీ సరైనవే అని ఒప్పుకుంటున్నట్లేనా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాబు తప్పు చేశారని చెబుతున్నారు పవన్!
భవన నిర్మాణ కార్మికులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్… ఇసుక సరఫరా సులభతరం చేసి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ డిమాండుల క్రమంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని.. అదే తప్పు నేటి ప్రభుత్వం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు పవన్. అవును… ఇసుక విధానంలో గత ప్రభుత్వం (టీడీపీ) చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ (వైకాపా) చేస్తోందని పవన్ మండిపడుతున్నారు. ఈ విషయాలపై వైకాపా నేతలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు!
ఐదేళ్ల పాటు బాబు అడ్డగోలు వ్యవహారాలు చేసినా స్పందించడానికి “మనసు రాకో, ధైర్యం లేకో” మౌనంగా ఉన్న పవన్ కు ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు గుర్తుకురావడం, జ్ఞానోదయం అవ్వడం సంతోషమని అభిప్రాయపడుతున్నారు వైకాపా నేతలు. బాబు తప్పిదాలను పవన్ నాడే తప్పుపట్టి, టీడీపీని కడిగి ఉంటే… 2019 ఎన్నికల్లో జనసేన పరిస్థితి, పవన్ పరిస్థితి అంత దయనీయంగా ఉండేది కాదని చెబుతున్నారు. ఏది ఏమైనా… ఈ విమర్శల ద్వారా పవన్ “ఎవరికీ తాను తొత్తు కాదని, ఇండివిడ్యువల్ పొలిటీషియన్ అని” నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారని కామెంట్లు పడుతున్నాయి. ఇది జనసేనకు శుభపరిణామమే అని అప్పుడే జనసైనికులు సంబరపడిపోతున్నారట!
ఎందుకంటే… బాబు వెనకాల తిరగడం జనసైనికులకు ఏనాడూ నచ్చలేదు! కానీ.. బాస్ మాట కాదనలేక వారు అలా బలవంతపు కాపురం చేస్తూనే వచ్చారు! పోనీలే అది ఇప్పటికైనా పోయింది అని సంతోషపడుతున్న సమయంలో… 2019 ఎన్నికల అనంతరం పూర్తిగా బీజేపీని వెనకేసుకు తిరగాలని పవన్.. జనసైనికులకు సూచనలు చేశారు. కానీ… కరోనా సహాయ కార్యక్రమాల్లో జనసైనికులు.. బీజేపీని ఎక్కడా కలుపుకుపోయిన దాఖలాలు లేవు! ఏ కార్యకర్త అయినా కోరుకునేది అదే కదా… తమ నాయకుడు సొంతంగా ఎదగాలని, సొంతంగా సాధించాలని, ఎవరికీ తోకగా ఉండకూడదని! ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో ఉన్నా… అది వీలైనంతవరకూ బయటకు కనిపించకుండా ఉండాలని!