గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన గాజువాక మీద జనసేనాని పవన్ కల్యాణ్ కి ఇంకా మోజు తగ్గినట్లు లేదు.లేదా పోయినచోటే వెతుక్కోవాలనది ఆయన సిద్ధాంతమేమో!
విషయానికొస్తే బిజెపి జనసేనలు సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయట.తాజాగాఏపీ రాజకీయ తెరపై సూపర్ జోడి సెట్ అయ్యింది. ఓ వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. మరోవైపు ఫైర్ బ్రాండ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజులు కదనోత్సాహంతో ఉన్నారు. బీజేపీ-జనసేన ఇద్దరు కలిసి బలోపేతం కావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారట..వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు ప్లాన్ చేశారని ఉమ్మడి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చూస్తున్నారని సమాచారం .అందులో భాగంగానే కరోనా తగ్గితే దసరా తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలని.. దానికి ఒక బహిరంగ సభ పెట్టి జాతీయ నేతలను పిలిపించి వైసీపీ మీద దుమ్మెత్తి పోయాలని ఆలోచన చేస్తున్నారట ఇందుకు ఉత్తర భారత కల్చర్ అధికంగా ఉండే విశాఖనే జనసేన-బీజేపీ సమరానికి తొలి వేదికగా నిర్ణయించుకున్నాయట.
వైసీపీ అధిష్టానంలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డాగా ఉన్న వైజాగ్ లోనే సమరశంఖం పూరించాలని రెండు పార్టీలు పట్టుదలగా ఉన్నాయని. పెద్ద ఎత్తున ఇక్కడ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.ఈ సభను పవన్ కల్యాణ్ ఓడిపోయిన గాజువాక నియోజకవర్గ పరిధిలో నిర్వహించాలని జనసేన పట్టుదలగా ఉందట .ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ .
పైకి బయటపడనప్పటికీ గాజువాకలో ఓటమి పవన్ కల్యాణ్ కి తీవ్రమైన అవమానంమిగిల్చింద౦టారు. భీమవరం లో కన్నా గాజువాకలో తన గెలుపు తధ్యమని పవన్ కళ్యాణ్ భావించారని ఒక టాక్.అయితే రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ కల్యాణ్ షాక్ తిన్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కల్యాన్ గాజువాక నుండే పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారని అందుకు ఇప్పటి నుంచే తనకు అనుకూలమైన వేదికను సిద్ధం చేసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి.భవిష్యత్తులో గాజువాకలో బిజెపి పవన్ జనసేనల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయట.ఏం జరగబోతోందో మరి కాలమే చెప్పాలి!