గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.తన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు కారకుడైన అన్నా రాంబాబు ను భవిష్యత్ ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
వంద కాదు మూడొందల అరవై కోట్లు ఖర్చు పెట్టినా రాంబాబును గిద్దలూరులో గెలవనీయం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.తన సోదరుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయిన రాంబాబు ఇప్పుడు వైసిపిలో కొచ్చాక గతం మర్చిపోయారా అని నిలదీశారు.మా ద్వారా రాజకీయాల్లోకొచ్చి మా కార్యకర్తనే చంపేవరకు వెళతారా అని నిలదీశారు.అన్నా రాంబాబు అయినా మరొకరైనా రాజ్యాంగానికి అతీతులు కాదని ఆయన వ్యాఖ్యానించారు.ప్రశ్నించే గొంతు నొక్కేసే అన్నా రాంబాబు లాంటి వారు ప్రజా ప్రతినిధులుగా ఉండకూడదన్నారు .రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చారన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులను తమ సమస్యల మీద నిలదీసే హక్కు ప్రతి ఓటరుకు ఉందన్నారు.ఎమ్మెల్యేగా గెలిచాక ఎవరు ఏమి అడిగినా సమాధానం అయినా చెప్పాలి తప్ప దూషించడం బెదిరించడం సరికాదని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే రాంబాబుకి హితవు పలికారు.గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు ఇటీవల తమ గ్రామ పర్యటనకు వచ్చిన అన్నా రాంబాబుని గ్రామ సమస్యలపై ప్రశ్నించగా ఆయన తీవ్రంగా దూషించి బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే .ఆ తర్వాత రెండు రోజులకే వెంకయ్యనాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం ఒంగోలు లో మీడియా సమావేశంలో అన్న రాంబాబుతోపాటు ప్రజాకంటకులుగా వ్యవహరిస్తున్న పలువురు వైసిపి ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.
గొడవకి దిగానా !ఎవరో ఒకరి తలకాయ తెగి పడాల్సిందే!
కాగా తాను అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటానని వైసిపి నేతలతో తానేమీ అనవసరంగా గొడవ పడబోనని పవన్ కల్యాణ్ చెప్పారు.అయితే ఒక్కసారి గొడవ పడానంటే మాత్రం ఎవరో ఒకరి తలకాయ తెగిపడాల్సిందేనని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్య చేశారు.తాను వెనక్కు తగ్గే మనిషిని కాదని ఎంతకైనా వెళ్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.