జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకూ ఈ జాబితాలో ఉన్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నాయి. ఈ సమయంలో కీలక చర్చ తెరమీదకు వచ్చింది.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున…
బీజేపీ ముఖ్య నేతలంతా పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, పార్టీ సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. తద్వారా పవన్ కళ్యాణ్ తమకు ఎంత ప్రత్యేకమైన వ్యక్తో తెలియజేశారు.
బీజేపీ గంపెడాశలు
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితుడైన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో వీర్రాజు మర్యాదపూర్వకంగా జనసేనానిని కలిశారు. భారతీయ జనతా పార్టీ- జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించారు. అలా పవన్ అండతో ఏపీలో పాగా వేయాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రత్యేక అజెండాతో ముందుకు సాగాలని డిసైడయ్యారు. తాజా శుభాకాంక్షల పరంపరతో ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటిస్తుందా అనే చర్చ తెరమీదకు వస్తోంది.
ఇంతకీ పవన్ ఏమన్నారంటే…
జన్మదినం సందర్బంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “కరోనాతో దేశం చిగురుటాకులా వణుకుతుంది. మాయదారి రోగం ఎవరిని కబళిస్తుందో అని జనాలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. డాక్టర్లు ఇలాంటి కష్ట సమయంలో ముందుండి పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలని భగవంతుడిని కోరుకుంటూ నేను చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో నేడు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వీకరించడానికి నా మనసు సిద్ధంగా లేదు. అయినా నా మీదున్న అభిమానంతో నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే తిరిగి మీముందుకు వస్తాను” అని పవన్ పేర్కొన్నారు.