జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనకు గాను షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.
‘ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 24 వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు కర్నూలు నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్ షో మొదలవుతుందని, కర్నూలు పట్టణంలోని సీ-క్యాంప్ నుంచి కొండారెడ్డి బురుజు వరకూ సాగుతుంది.
అదే రోజు మహిళల సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమంలో సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధి స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై చర్చ ఉంటుంది. 25న ఆదోనిలో పర్యటిస్తారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పత్తి రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. 26న తేదీన ఆళ్ళగడ్డలో పర్యటిస్తారు.’ అని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.