Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల గొడవలు వార్తలు మీడియా సర్కిల్స్ లో వైరల్ కాగా నిన్న మొత్తం షర్మిల పార్టీ గురించి వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావటానికి తాను రంగంలోకి దిగుతున్న ట్లు, కమిట్ మెంట్ గా పనిచేయటానికి పూనుకున్నట్లు.. రైతుల కోసం అదేవిధంగా పేద విద్యార్థుల కోసం నిర్ణయం తీసుకున్నట్లు ఈ క్రమంలో పలువురు సూచనలు తీసుకోవడానికి రెడీ అయినట్లు షర్మిల చెప్పుకొచ్చారు. దీంతో షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పై రకరకాల పార్టీల నాయకులు రక రకాలుగా స్పందించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan కూడా షర్మిల పార్టీ పై ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రులకు అదేవిధంగా అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ని మీడియా ప్రతినిధులు షర్మిల పార్టీ పై ప్రశ్నలు వేయడం జరిగింది. దీనిపై రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్… ఆమె ఇంకా పార్టీ స్థాపించలేదు కదా..? పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం అన్నారు..
ఇక, ప్రతీ ఒక్కరూ పార్టీ పెట్టుకోవచ్చు అని కామెంట్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా అన్నారు. ఇదే సమయంలో కెసిఆర్ పాలన గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..ఈ విషయం గురించి హైదరాబాదులో మాట్లాడదాం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై అదేవిధంగా ఆలయాల పై జరుగుతున్న దాడులు మరియు శాంతిభద్రతల విషయం గురించి అమిత్ షా తో చర్చించినట్లు పవన్ స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక మార్చి 3,4 తేదీలలో మరొకసారి కూర్చుంటానని..అప్పుడు కూలంకుషంగా అన్ని విషయాలు చర్చించుకుంటాం అని పవన్ స్పష్టం చేశారు.