Pawan Kalyan: ఏపిలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. లక్ష రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ (రేపు) పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో కౌలు రైతు భరోసా యాత్రను జనసేన పార్టీ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 200 మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అంచనా. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చెక్కులను అందించనున్నారు.
అయితే పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో హెటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉంది. మాచర్లకు ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. నేడు టీడీపీ చలో మాచర్లకు పిలుపునివ్వడంతో పలువురు టీడీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, మరో పక్క మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లికి పవన్ కళ్యాణ్ రానుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నియోజకవర్గం నుండి పలువురు నేతలు పవన్ కళ్యాణ సమక్షంలో జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఈ రోజు నరసరావుపేటలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరిపతి ఉన్న రైతు కుటుంబాలకే ప్రభుత్వ పరిహారం అందిందని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించే మనసు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పరహారం చెల్లింపు లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చిన్న చిన్న రైతులకు పరిహారం అందడం లేదని అన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి మీరు ఇచ్చేది నిజం అయితే మా సవాల్ ను స్వీకరించాలని, సత్తెనపల్లి సభకు రావాలనీ, పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు పడిన బాధలు మీకు తెలియజేస్తామని, వారికి ఎందుకు సాయం అందలేదన్న విషయాన్ని ఆ కుటుంబాల నోటితో నే వినవచ్చునని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా ఉన్న నేపథ్యం లో పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.