దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివరించారు.
“గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్టుకి సంబంధించిన వివాదం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి కచ్చితంగా మాట్లాడాలి. ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే“అని పవన్ కళ్యాణ్ వివరించారు.
హిందూ మతం అంటే ఎందుకు ఇంత?
“ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారా అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు. “ అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. “రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ , ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా? “ అని పవన్ పేర్కొన్నారు.
ఇదేం లౌకికత్వం?
“ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు. మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా… నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయి.“ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఒకటి కాదు…రెండు కాదు
ఇది ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. “పిఠాపురం నుంచి ఆందోళనకర ఘటనలు మొదలయ్యాయి. సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఊరది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. ఔనా…అనుకున్నాం. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. నాకేం అర్ధం కాలేదు. ఓహో ఇలా జరుగుతాయా అనుకున్నా. ఇప్పుడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి.“ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సమగ్ర విచారణే
“నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది. ముక్కలు చెల్లాచెదురైపోయాయి. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. తాము చెబుతున్న కారణాలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. దీని మీద నేను కోరుకునేది ఒకటే. సమగ్ర విచారణ జరపాలి. మీరు చెప్పినట్టు మతిస్థిమితం లేని వాళ్లు అనేది కాకుండా పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో విచారించాలి“ అని పవన్ వివరించారు.
హిందూ భక్తులు ఎందుకు ఇలా?
భక్తులు మౌనంగా భరిస్తూ ఇబ్బంది పడుతున్నారు ఏ సంప్రదాయాన్ని ఎవరూ కించపర్చకూడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. హిందువుల విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని ఎవరు తిట్టినా మాట్లాడరు. ఇతర మతాల సంప్రదాయాన్ని, విశ్వాసాల్ని ఎవరో ఎక్కడో అమెరికాలోనో, యూరప్ దేశాల్లోనో అగౌరవపరిస్తే నిరసనలు ఉవ్వెత్తున ఉంటాయి. కానీ మనకి ఇక్కడ పిఠాపురంలో జరిగినా, కొండబిట్రగుంటలో జరిగినా, అంతర్వేది రథం దగ్ధం జరిగినా స్పందించడానికి ఇబ్బందిపడతారు. ఉదాహరణకు శబరిమల అయ్యప్పస్వామి గుడికి ఒక సంప్రదాయం ఉంది. నియమాలు ఉన్నాయి. ప్రతి మతానికి ఒక సంప్రదాయం ఉంది. ప్రతి పుణ్యక్షేత్రానికీ ఒక సంప్రదాయం ఉంది. సంప్రదాయం దాటి వెళ్లం. కానీ అలాంటి విశ్వాసాల్ని, నియమాల్ని ఛాలెంజ్ చేస్తారు. వేరే మతంలో ఓ పదిమంది బాధపడితే గగ్గోలుపెట్టేసే వాళ్లు. ఇన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే సంఘటనలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరు. భక్తులు కూడా మౌనంగా ఇబ్బందిపడతారు. ఇదే వేరే ఏ మతం అయినా ఏ స్థాయిలో గొడవలు జరిగి ఉండేవో మనం ఊహించుకోగలం.“ అని పవన్ విశ్లేషించారు.
వాళ్లు ఏ మతస్తులు?
“ఈ విధ్వంసం చేస్తున్న వాళ్లు తమ ఉనికి కోసం చేస్తున్నారా? వాళ్లు ఏ మతస్తులు… ఏ కారణాలతో చేస్తున్నారు… వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా? అని తేల్చాలి. వారికి ఉగ్రవాద నేపథ్యం ఉందా గొడవలు రేపేసి మతకలహాలు రేపేసి తద్వారా అస్థిరత సృష్టించడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారా? దీని వెనుక ఉగ్రవాదుల చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణం నుంచి కూడా చూడాలి… జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుర్గాదేవి, గణపతి, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. స్వామి వారిని ఊరేగించే రథాల్ని దగ్ధం చేస్తుంటే… ఏమనుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందా? సంఘ విద్రోహులెవరైనా ఉన్నారా? లేదంటే రాజకీయ లబ్ది పొందడానికి ఎవరైనా చేస్తున్నారా? వీటన్నింటినీ అన్ని కోణాల్లో చూసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.“ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
సీబీఐ , ఎన్ఐఏ విచారణ?
“ ఈ ఘటనల విషయంలో సమగ్ర దర్యాప్తు కోసం వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. ఒక మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించండి. ఎందుకంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరిగినా అది మతిస్థిమితం లేని వ్యక్తి మీద పెడతారు. అతను మాట్లాడలేడు. అతని ఉనికె అతనికి తెలియదు. కొద్ది రోజుల్లో సరైన చర్యలు లేకపోతే కచ్చితంగా సిబిఐ దర్యాప్తు కోసం, ఉగ్రవాద కోణం ఉన్నదనిపిస్తే ఎన్.ఐ.ఎ. వారిని కూడా దృష్టి సారించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాము.“ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.