సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాల్లో ఆ పార్టీ వేర్వేరుగా సంయుక్తంగా కలిసి ముందుకు సాగుతోంది.
తాజాగా మరో నిరసన కార్యక్రమం ప్రకటించింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా గురువారం భారతీయ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియచేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బీజేపీతో కలిసి నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలని సూచించారు. నాయకులు, శ్రేణులు ఎవరి ఇళ్ళలో వారే ఉండి నిరసన తెలుపుదామని నూతన ఆందోళన పర్వానికి శ్రీకారం చుట్టారు.
పవన్తో మాట్లాడిన తర్వాతే…
ప్రాంతీయ సమన్వయ కమిటీలు, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లను జనసేన పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆందోళన గురించి బీజేపీ నాయకత్వం జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో చర్చించారనీ తెలిపారు. నిరసనలో భాగంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని చెప్పారు.
ప్రభుత్వం వైఫల్యమే
అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఘటనపై తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. భాగస్వామ్య పక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుదాం“ అని వెల్లడించారు.
ఎందుకీ అరెస్టులు?
నిరసనల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులను, నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడం బాధాకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే అంతర్వేదిలో చోటుచేసుకున్న ఘటనపై నిరసన తెలిపిన యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. “అక్కడ చోటు చేసుకున్న ఘటనపై బాధపడుతున్నవారిపైనే ఎదురు కేసులుపెట్టి అరెస్టులు చేయడం సరికాదు. ఆ సంఘటనకు బాధ్యులైన వారి గురించి విచారణపై దృష్టి పెట్టకుండా మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లపై కేసులు పెడుతున్నారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అరెస్టుల విషయం, నాయకుల్ని గృహ నిర్భందంలోకి తీసుకోవడాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళాం.“ అని వెల్లడించారు.
ఇదే జనసేన కోరిక
వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుందనే అంశం మీద పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు. “రాత్రి నుంచి అమలాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తల హౌస్ అరెస్టులు బాధాకరం. పిఠాపురం ప్రాంతంలోనూ పోలీసులు మన కార్యకర్తలు, వీర మహిళలను హౌస్ అరెస్టులు చేశారని సమాచారం వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఖరి ఏమిటో అర్థం అవుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుంటూ అన్ని మతాలను గౌరవించుకునే విధంగానే ముందుకు వెళ్దాం.“ అని వెల్లడించారు.
ప్రభుత్వం చేసిన పనికి….
అంతర్వేది అంశంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుని, తక్షణం స్పందించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని నాదెండ్ల మనోహర్ అన్నారు. “రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నాలుగో ఘటన ఇది. ప్రభుత్వం విచారణ పారదర్శకంగా చేపట్టాలి. ప్రభుత్వం విఫలమైతే సీబీఐ విచారణ చేపట్టాలి అని పవన్ కల్యాణ్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. నిరసనలు చేపట్టే ముందు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించండి.“ అని సూచించారు.