అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు చాలా రోజులుగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ గాజువాక, అనంతపురం, తిరుపతి పరిశీలనలో ఉన్నాయి.
గతంలో అనంతపురం పర్యటనలో ఉన్నపుడు పవన్ తాను అనంతపురం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. బయటకు చెప్పకపోయినా ఏలూరు నియెజకవర్గం కూడా పరిశీలనలోకి వచ్చింది. తిరుపతిలోని జనసేన కార్యకర్తలు పవన్ అక్కడి నుంచే పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ అన్నయ్య చిరంజీవి కూడా తిరుపతి నుంచే పోటీ చేసి గెలిచారు.
చిరంజీవి అప్పుడు తిరుపతి నుంచే కాక పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు నుంచి కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విజయం నల్లేరు మీద నడక అయ్యే నియోజకవర్గం ఎంచుకోవాలని జనసేన నాయకత్వం భావిస్తోంది. విశాఖ జిల్లాలోని గాజువాక సురక్షితమైన నియోజకవర్గంగా గుర్తించారు. అయితే ఇంకా పరిశీలన కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కొత్తగా విజయవాడ సెంట్రల్ పరిశీలనకు వచ్చినట్లు చెబుతున్నారు.