ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఎలా సాగుతాయోయి అన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు గతంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ పొత్తు వల్ల వీరిద్దరి మధ్య త్వరలోనే ఎన్నో సమస్యలు వస్తాయని వారు అప్పుడే ఊహించారు. ఇక తెలంగాణలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వెనక్కి తగ్గిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
ఇంటికి వచ్చి మరీ….
జనసేన అభ్యర్థుల చేత ముందు పోటీ చేయించి ఆ తర్వాత బిజెపి కోరిక మేరకు ఆయన విత్ డ్రా చేయించారు. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల కోసం రెడీ అవుతూ ఆ సీటు కోసం కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే ఏపీ బీజెపీ మాత్రం తిరుపతి ఉప ఎన్నిక స్థానం తమదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ సీటు జనసేన కోసం వదులుకునేందుకు మాత్రం తాము ఏ రకంగానూ సిద్ధం లేము అని ఇన్ డైరెక్టుగా చెబుతోంది. ఈ క్రమంలోనే బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి మరి అతనిని దువ్వే పనిలో ఉన్నట్లు అర్థం అయింది.
జనసేనే మేలే…..
ఇక గ్రేటర్ ఎన్నికల్లో పవన్… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు వెనకడుగు వేశారు. ఇప్పుడు కూడా జనసేన ను తిరుపతి ఉపఎన్నిక నుండి డ్రాప్ చేసే బాధ్యతను సోము వీర్రాజు, పురంధేశ్వరి తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 2024లో బిజెపి-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావాలంటే ఇప్పుడు వారు తిరుపతి ఉప ఎన్నిక సీటుని త్యాగం చేయాల్సిందే అన్నట్లు సోము వీర్రాజు జనసేన పై ఒత్తిడి పెంచుతున్నారని అర్థం అవుతోంది. బిజెపి ఇప్పటికే ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలవలేదు. ఇక ఓట్ల శాతంలో వారితో పోలిస్తే జనసేన పార్టీ చాలా మేలు.
తిరుపతిని వాడుకుంటున్నారు….
ఇక అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కూడా తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక సీటు బీజేపీకి ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్న వాదనలు ఉన్నప్పటికీ జనాల్లో బిజెపి అంత తీవ్రంగా వెళ్ళిందా అన్న విషయంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ లాగే ఏపీలో కూడా బిజెపి లో ఊపు తీసుకుని వచ్చేందుకు తిరుపతి ఉపఎన్నిక సీటు ని వాడుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తమ జనసేనాని తగ్గకూడదని జనసేన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ వెనక్కితగ్గే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరి పార్టీ వారి సంగతి?
ఈ ఒక్క సీటు బిజెపికి వదిలేస్తే పార్టీ పరపతి పెరిగి కేంద్రం వద్ద మైలేజీ వస్తుందని అతని ఆలోచిస్తున్నాడని సమాచారం. ఇక ఈ సీటు గెలిచినంత మాత్రాన జనసేన కు ఎంత వరకు లాభం వస్తుంది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే అటు హైదరాబాదులో ఇటు తిరుపతి లో వచ్చిన అవకాశాలని వదులుకుంటే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన కూడా జనసేన లో కనిపిస్తోంది. దీని వల్ల జనసైనికుల ఆత్మవిశ్వాసం కూడా భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరి పవన్ దారి ఎటు?