Jagan Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా రోడ్ల పరిస్థితి మారిందని.. రోడ్ల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పవన్ సీరియస్ అయ్యారు. ఇదే క్రమంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా రహదారుల వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో లక్షా ఇరవై వేల కిలోమీటర్లకు పైగా రహదారులు ఉన్నాయని స్పష్టం చేశారు.
అటువంటి రోడ్లు దెబ్బతిన్న కానీ ప్రభుత్వంలో చలనం లేదని.. రోడ్లు మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ సెప్టెంబర్ 2, 3, 4 తారీకులలో సోషల్ మీడియాలో.. ఎవరికి వారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి పోస్టులు పెట్టాలని పవన్ ప్రజలకు సూచించారు. అప్పుడైనా ప్రభుత్వంలో చలనం కలుగుతుందేమో చూడాలి అంటూ తెలిపారు. అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే అక్టోబర్ రెండో తారీకు… రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహించి రోడ్లను మనమే బాగు చేసుకుందామని పవన్ తెలిపారు.
గతంలో నివర్ తుఫాన్ వచ్చిన సమయంలో.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటించిన సమయంలో కూడా రోడ్ల పరిస్థితి ఇలానే ఉందని పవన్ మండిపడ్డారు. ఇదేదో రాజకీయ విమర్శలకు లేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా.. రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులతో పాటు లాఠీ చార్జీలు చేస్తున్నారని.. అక్టోబర్ రెండవ తారీఖు లోపు రాష్ట్రంలో రోడ్ల సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.