డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష అన్న టైటిల్ తో పాటు ఓమ్ శివమ్ అన్న టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం.. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ అన్ని సినిమాల మాదిరిగా తిరిగి ప్రారంభం అవుతుందని భావించారు. కాని ఎక్కువ మంది యూనిట్ సభ్యులు అవసరం కావడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదని అందుకే కొంత గ్యాప్ తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళేది 2021 లోనే అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండటం ఇష్టం లేని క్రిష్.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఒక సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ ఒక సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాని 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేయనున్నాడు క్రిష్. అయితే ఒకవైపు వైష్ణవ్ తేజ్ సినిమా చేస్తున్నప్పటికి మరోవైపు మాత్రం పవన్ కళ్యాణ్ తో చేసే పీరియాడికల్ సినిమా మీదే దృష్ఠి ఉందని తెలుస్తుంది.
అంతేకాదు తన అసోసియేట్స్ తో పవన్ సినిమా కి సంబంధించిన పనులను సాగిస్తున్నాడట. ఆర్టిస్టుల డేట్స్ .. లొకేషన్స్ కి సంబంధించిన పనులను కానిచ్చేస్తున్నాడట. వైష్ణవ్ తేజ్ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టించి వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నాడట. వీలైతే నవంబర్ లేదా డిసెంబర్ నుంచి పవన్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.