పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. జనసేన కార్యకలాపాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీని నడపడానికి డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముందుగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ ను ఓకే చేసాడు.
వకీల్ సాబ్ గా దిల్ రాజు నిర్మాణంలో ఈ ఏడాది జనవరిలో షూటింగ్ మొదలైంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 70 శాతం షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈరోజు వకీల్ సాబ్ షూటింగ్ మొదలైంది. ఈరోజు నుండి నెలాఖరు వరకూ నైట్ షూట్స్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా నైట్ షూట్ నే చేసిన విషయం తెల్సిందే.
అయితే ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ లేకుండా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. అక్టోబర్ రెండో వారం నుండి పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. అలాగే నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను ముగించేసి తన తర్వాతి సినిమాను పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలకు కమిటై ఉన్నాడు.
క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ జానపద చిత్రం ఒకటి సెట్స్ మీద ఉంది. కేవలం 15 రోజుల షూటింగ్ లాక్ డౌన్ కు ముందు సాధ్యమైంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ కమిటయ్యారు. ఈ రెండు సినిమాలు 2021లో సెట్స్ పైకి వెళతాయి. ఈ చిత్రాలు అన్నీ కాకుండా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మరో హీరోను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.