జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత రైతులను పరామర్శించడం జరిగింది. నివర్ తుఫాన్ దాటికి నష్ట పోయిన రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది అంటూ పవన్ పేర్కొన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి సరైన సహాయం అందలేదని పవన్ తన తాజా పర్యటనలో మండిపడ్డారు.
రైతుల కష్టాలు అంటే ఏంటో నాకు తెలిసి నేను రైతులకు న్యాయం జరిగే విషయంలో ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తన తాజా పర్యటనలో తెలిపారు. కృష్ణాజిల్లా నివర్ బాధిత రైతులతో పరామర్శ చేసిన జనసేనని వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు సరైన న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జరిగిన నష్టాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సహాయం ఏ మాత్రం రైతులకు సరిపోదని, ఎకరాకు ప్రభుత్వం పాతిక వేల నుండి 30 వేల వరకు ఇస్తే బాగుంటుందని సూచించారు. తక్షణ సహాయం కింద ఐదు వేల రూపాయలు గాని పది వేల రూపాయలు గాని వెంటనే ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని తెలిపారు. నష్టపరిహార సొమ్ము కోసం నెలల తరబడి రైతులను వేచి ఉంచే కార్యక్రమం ప్రభుత్వం చేయకూడదని పవన్ గట్టిగా తెలిపారు. ఇక కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల కూడా పవన్ సీరియస్ కామెంట్లు చేశారు. పొలం యజమానులతో సమానంగా వారికి నష్టపరిహారం అందించాలని కోరారు. 48 గంటల్లోగా నష్టపోయిన రైతులకు కౌలు రైతులకు తక్షణ సాయం అందించాలని పవన్ డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు పోరాడతామని పవన్ హామీ ఇచ్చారు.