తూర్పు గోదావరి జిల్లా కొత్తపాకలలోని దివిస్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత స్థలం నుంచి ఎలాంటి వ్యర్థాలను విడిచిపెట్టవద్దని పరిశ్రమల శాఖ శనివారం ఉదయం దివిస్ ఫ్యాక్టరీ కి అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ఈ స్థలాల్లో హేచరీలు, ఆక్వా ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించింది.ఈ ఫ్యాక్టరీ కారణంగా తమ జీవనోపాధికి భంగం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది .జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఆ ప్రాంతంలో పర్యటన చేపడుతున్న సందర్భంలో జగన్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయటం విశేషం.
ఆది నుండి వ్యతిరేకతే!
దివిస్ ఫ్యాక్టరిని స్థానిక ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.ఆ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాల వల్ల కాలుష్యం తీవ్రంగా ప్రబలుతోందని గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ దివిస్ ను వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.కాగా ఇప్పటికే ఫ్యాక్టరీ పనులు ప్రారంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలు, హేచరీస్, చేపలు, రొయ్యలు నాశనమౌతుందని, భూగర్భ జలాలు కలుషితమౌతాయని ప్రజలు వాదిస్తున్నారు. తమ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశాలున్నాయని అంటున్నారు.
మూడు గ్రామాల ప్రజల ఆందోళన
తొండంగి మండలం కొత్తపాకల సమీపంలో దివిస్ ఫార్మా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కొత్తపాకల, పంపాదిపేట, తాటియాకులపాలెం గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఫార్మాఫ్యాక్టరీ వల్ల తమ మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో పరిశ్రమకు అనుమతులు ఇవ్వగా అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలతో హోరెత్తించాయి. 2016 లో వామపక్ష పార్టీలు, ఫార్మాస్యూటికల్ పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసింది దివిస్ యాజమాన్యం.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరికొన్ని రకాల అనుమతులు తెచ్చుకుని కార్యకలాపాలు ప్రారంభించారు
దివిస్ పరిశ్రమపై దాడి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది నవంబర్లో యాజమాన్యం మళ్లీ పనులు ప్రారంభించింది. గత నెలలో దివిస్ సమీప గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేశారు. గత నెల 17న దివిస్ పరిశ్రమపై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో పోలీసులు సుమారు 150 మంది పై నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దివిస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారు ఇప్పటికీ పలు జైళ్లలో రిమాండ్లో ఉన్నారు.
రంగంలోకి దిగిన పవన్!
దివీస్ ల్యాబ్స్ ఏర్పాటుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం తోపాటు తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన కారులకు మద్దతుగా ఆ ప్రాంత పర్యటన పెట్టుకున్నారు.దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయింది.ఆ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదత స్థలం నుంచి ఎలాంటి వ్యర్థాలను విడిచి పెట్టవద్దని పరిశ్రమల శాఖ ఆదేశించింది.ఎప్పట్నుంచో ఈ వివాదం నడుస్తుండగా పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంలో జగన్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.జనసేనానికి రాజకీయ మైలేజీ రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకుందని భావిస్తున్నారు.