మీటూ ఉద్యమం రెండేళ్ల క్రితం ఉదృతంగా సాగింది. శ్రీరెడ్డి పుణ్యమా అని తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విషయం గురించి చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై పెద్దగా ఎవరూ దృష్టి నిలపట్లేదు. అలాంటి సమయంలో ఒక హీరోయిన్ వచ్చి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తనను రూమ్ కు పిలిచి కో-ఆపరేట్ చేయమన్నాడని చెప్పుకొచ్చింది.
ఆ హీరోయిన్ పేరు పాయల్ ఘోష్. ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి సినిమాలో నటించిందీ హీరోయిన్. మంచు మనోజ్ ప్రయాణం సినిమాలో కథానాయిక ఈ భామ. పాయల్ ఘోష్ కథనం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రూమ్ కు పిలిచాడట. రూమ్ లోపలకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తాను కాదంటే హ్యూమా ఖురేషి, మహి గిల్ లాంటి కథానాయికలు తాను కోరింది చేశారని తనను కూడా కో-ఆపరేట్ చేయమని అన్నాడని పాయల్ ఘోష్ తీవ్రమైన వ్యాఖ్యలనే చేసింది.
ఈ విషయంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మొదట మౌనం వహించాడు. తర్వాత తాను ఎలాంటి వ్యక్తో తనతో పనిచేసిన ఏ హీరోయిన్ ను అడిగినా చెబుతారని, ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తెలియజేసాడు. తన వీడియో చూస్తేనే అవి పుకార్లని అర్ధమైపోతోందని వ్యాఖ్యానించాడు అనురాగ్. తనపై ఇన్ని విమర్శలు చేసినా తనకు మంచే జరగాలని కోరుకుంటానని అన్నాడు. అయితే అనురాగ్ కంటే ముందు ఈ విషయంలో తాప్సి రియాక్ట్ అయింది.
అనురాగ్ వంటి వ్యక్తిని అనుకోకూడదని, ఆరోపణలు చేస్తే వెంటనే ఆరోపణలు పడ్డ వ్యక్తిని అనుమానించకూడదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు అవే వ్యాఖ్యలు తనను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎందుకంటే రెండేళ్ల క్రితం మీటూ ఉద్యమం అప్పుడు హీరోయిన్లు ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోరా, వారిని ఎందుకు అనుమానంగా చూస్తారు అని చెప్పిన తాప్సి ఇప్పుడు తన స్నేహితుడైన అనురాగ్ వైపు విమర్శలు వచ్చేసరికి ప్లేట్ తిప్పింది. ఈ రెండు వ్యాఖ్యలను పక్కపక్కన పెట్టి ఇప్పుడు తాప్సిను తెగ ట్రోల్ చేస్తున్నారు.