Tulasi Reddy: రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అమరావతి రైతుల ఆధ్వర్యంలో నిన్న తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం అయ్యింది. ఈ సభలో పాల్గొన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడానికి ఏ బిల్లులు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తూ వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయవచ్చని అన్నారు. ఓ సామెత ఉంది నీది తెనాలే నాది తెనాలే అంటారు. అలానే జగన్మోహనరెడ్డిది పులివెందులే, నాది పులివెందులే. రేపు క్రిస్టమస్ పండుగకు సీఎం జగన్మోహనరెడ్డి పులివెందులకు హెలికాఫ్టర్ లో కాకుండా రోడ్డు మార్గాన రావాలని సూచించారు. అదే మాదిరిగా రోడ్డు మార్గాన పులివెందుల నుండి అమరావతికి, పులివెందుల నుండి విశాఖకు, విశాఖ నుండి అమరావతికి రోడ్డు మార్గాన ప్రయాణించి చూస్తే రోడ్ల పరిస్థితిని చూసి రాజధాని విశాఖ వద్దు, అమరావతే రాజధాని బెస్ట్ అన్న నిర్ణయానికి వస్తారని జగన్ రెడ్డి వస్తారని తులసిరెడ్డి అన్నారు.
Tulasi Reddy: స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేయాలి
ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా, కొందరు వైసీపీ శ్రేణులు ఇబ్బందులు కల్గించినా దృఢ సంకల్పంతో, ప్రజాస్వామ్య పద్దతిలో అమరావతి రైతులు మహోద్యమం నడపడం అభినందనీయమని అన్నారు తులసిరెడ్డి. జగన్మోహనరెడ్డి ఇటీవల తీసుకున్న వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీడిఏ రద్దు చట్టాలను ఉప సంహరించుకోవడాన్ని హర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో మళ్లీ కొన్ని సవరణలు చేసి వికేంద్రీకరణకు మెరుగైన బిల్లు తీసుకువస్తామని జగన్ చెప్పారనీ ఇది ఆమోద యోగ్యం కాదని తులసిరెడ్డి అన్నారు. నిజంగా జగన్మోహనరెడ్డికి అభివృద్ధి వికేంద్రీకరణపై చిత్తశుద్ది ఉంటే మళ్లీ బిల్లు తేకుండానే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, జిల్లా పరిషత్ లకు, కార్పోరేషన్ లకు రాజ్యాంగంలోని 73, 74 సవరణల ప్రకారం నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేస్తే అది నిజమైన పరిపాలనా వికేంద్రీకరణ అవుతుందన్నారు. లేదు అభివృద్ధి వికేంద్రీకరణ అందామా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా తీసుకువచ్చి 13 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించాలని కోరారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయండనీ దీనికి ప్రత్యేకంగా బిల్లు అవసరం లేదని అన్నారు.
కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ప్రత్యేక హోదా తీసుకురండి
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు విభజన చట్టంలో పేర్కొన్న ప్యాకేజీ ప్రకారం కేంద్రం నుండి నిధులు తెప్పించి అభివృద్ధి చేయాలని దీనికి ఏ బిల్లు అవసరం లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్, కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయించాలని సూచించారు. అదే విధంగా కర్నూలులో హైకోర్టు లేకపోతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయించండి., కడప, మదనపల్లి రైల్వే మార్గానికి నిధులు ఇచ్చి పూర్తి చేయండని సూచించారు. కడప జిల్లాలో హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు అనుమతులు తెప్పించి పూర్తి చేస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. విశాఖకు మెట్రో రైల్, రైల్వే జోన్ తెప్పించాలన్నారు. వీటికి బిల్లులు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. విశాఖను ఐటి రాజధానిగా, ఆర్ధిక రాజధానిగా లేదా సినిమా రాజధానిగా అభివృద్ధి చేస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే ఇవన్నీ చేయవచ్చని తులసిరెడ్డి పేర్కొన్నారు.