కడప: మాటతప్పం, మడమ తిప్పం అని పదేపదే చెప్పుకునే వైసిపి రైతుల విషయంలో మాట తప్పడం భావ్యం కాదని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఏటి దాటేంత వరకూ ఓటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న’ అన్న చందంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతు భరోసాపై ప్రభుత్వం మాటతప్పిదని అన్నారు. ఇది రైతు భరోసా కాదు – రైతు నిరాశ పథకం అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతు భరోసా పథకం పేరుతో ఎన్నికల ముందు రైతులను నమ్మించి వారి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల షరతులు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని మానిఫెస్టోలో హామీ ఇచ్చిందనీ, ఇప్పుడేమో కేవలం 6500 రూపాయలు మాత్రమే ఇస్తామనడం విడ్డూరంగా ఉందనీ తులశిరెడ్డి అన్నారు. మాజీ సర్పంచ్లు, ఎంపిటిసి, జడ్పిటిసిలకు వర్తించదనీ, అగ్రవర్ణ కౌలు రైతులకు వర్తించదనీ చెప్పడం దురదృష్టకరమని తులసిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తులసిరెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు కొండవీటి చాంతాడులా మారాయనీ, సలహదారుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారనీ తులసిరెడ్డి విమర్శించారు.