తమిళనాడులో ఖాకీల కర్కసత్వానికి బలమైన తండ్రికొడుకుల(జయరాజ్.. బెన్నిక్స్) ఉదంతం లో తమిళనాడు పోలీసులకు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు పోలీస్ లదేతప్పంతా అని చెప్పటానికి బలమైన సీసీటీవీ సాక్ష్యాలు లభించాయి.తమిళ పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాకీలకు కోపం వచ్చి ఒక షాపు యజమానులైన తండ్రికొడుకుల్ని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయటం.. వారి మరణానికి కారణం కావటం తెలిసిందే.
లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమిస్తూ.. షాపును తెరిచి ఉంచారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. షాపు బయట విపరీతమైన రద్దీ ఉందని.. లాక్ డౌన్ వేళ కావటంతో వారిని వెళ్లమని పోలీసులు చెబితే.. వారిపై తండ్రికొడుకులు బూతులు తిట్టినట్లుగా పోలీసులు చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణలో వారు మరణించారు. విచారణ పేరుతో పోలీసులు పెట్టిన హింసకు వారిద్దరూ బలి అయ్యారన్న వాదన జోరు పెరిగింది.
ఈ కేసుకు సంబంధించిన ఇప్పటివరకూ పోలీసులు వినిపిస్తున్న వాదన తప్పుగా తేలింది. లాక్ డౌన్ వేళలో షాపు బయట పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నది నిజం కాదన్న విషయం తాజాగా బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇందులో షాపు ముందు ఎవరూ లేకపోవటమే కాదు.. పరిసరాలు ఖాళీగా ఉండటం కనిపిస్తుంది.
షాపులోకి వెళ్లిన పోలీసులు జయరాజ్ తో మాట్లాడటం.. బయటకు వెళ్లటం.. తర్వాత వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకోవటం లాంటివి చూస్తే.. ఎలాంటి కారణాలు లేకుండా అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. తండ్రికొడుకుల్ని దారుణంగా టార్చర్ పెట్టటంతో వారు ప్రాణాలు విడిచారు. ఈ ఉదంతంలో తాజాగా బయటకొచ్చిన సీసీ ఫుటేజ్ పోలీసు శాఖను ఆత్మరక్షణలో పడేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.ఏ రాష్ట్రంలో నైనా పోలీసుల తీరు ఒకేలాగ ఉంటుంది అని మరో సారి రుజువైంది