తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ కేసులు నిత్యం భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేస్తుండడం.. మరోవైపు ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో వెలుగు చూస్తున్న సంఘటనలు.. కరోనా టెస్టుల ఫలితాలు వచ్చేందుకు తెలంగాణలో చాలా సుదీర్ఘమైన సమయం పడుతుండడం.. టెస్టులు చేయడాన్ని రెండు రోజుల పాటు నిలిపివేయడం.. తదితర సంఘటనలతో జనాలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ దాని చుట్టు పక్కల ఉన్న వారు కరోనా పట్ల తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ప్రస్తుతం ఏపీకి పెద్ద ఎత్తున ప్రయాణమవుతున్నట్లు తెలిసింది.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో పరిస్థితి వేరు. అక్కడ మొదట్నుంచీ కరోనా టెస్టులను పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి శాంపిల్స్ సేకరిస్తూ, థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. జోన్ల వారీగా కట్టుదిట్టంగా కరోనా నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలోకి రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో వచ్చే వారిని అన్ని రకాలుగా పరీక్షించి, కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయాలను నిర్దారించుకుని, వారి పూర్తి వివరాలను సేకరించాకే ఏపీలోకి అనుమతి ఇస్తున్నారు. ఏపీలోకి ప్రవేశించినా కచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని చెబుతున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హాస్పిటళ్లకు తరలించి పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. తెలంగాణ కన్నా ఏపీనే కోవిడ్ నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందువల్లే జనాలు ఇప్పుడు ఏపీకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సరిహద్దుల వద్ద ఇప్పుడు భారీగా వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.
తెలంగాణతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పరిస్థితి రోజు రోజుకీ తీవ్రతరమవుతుండడంతో హైదరాబాద్, దాని చుట్టు పక్కల నివాసం ఉంటున్న ఏపీ వాసులు తమ సొంత రాష్ట్రానికి ప్రయాణమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో తెలంగాణ కన్నా ఏపీనే సేఫ్ అని వారు భావిస్తున్నారని, అందుకనే వారు పెద్ద సంఖ్యలో ఏపీకి వెళ్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
అయితే ఏపీ పోలీసులు మాత్రం స్పందన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని పాసులు కలిగి ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అది కూడా అన్ని వివరాలను పరిశీలించి, పౌరులకు కరోనా లక్షణాలు లేవని నిర్దారించుకున్నాకే పోలీసులు వారిని విడిచిపెడుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరోనా విషయంలో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమిస్తే గానీ ప్రజల్లో భయాందోళనలు తగ్గవని, ఆ తరువాత ఏపీ సరిహద్దుల వద్ద ఇంతటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.