ఉదయం టిఫిన్ తినకపోవడం ఎంత ప్రమాదమో, అర్ధరాత్రి సమయంలో చిరుతిళ్లు తినడం కూడా అంతే ప్రమాదం! అర్ధరాత్రి సమయం లో తినే వారికి షుగర్, హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెక్సికో వర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. వారి పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం వలన వాటి రక్తంలో కొవ్వు నిల్వలు అధికంగా పెరిగినట్టు గుర్తించారు.
అదే విధంగా వాటికి ఉదయం అధికమొత్తంలో కొవ్వు ఉండే ఆహార పదార్థాలు ఇస్తే, కొవ్వు స్థాయి లో పెద్దగా మార్పు లేదు. కాబట్టి మధుమేహం,హృద్రోగాలు రాకుండా ఉండాలంటే అర్ధరాత్రి తిండికి దూరంగా ఉండడమే సరైనది. నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగడంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలకు దారి తీస్తుంది.
నగరాల్లో రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ తింటుంటారు. అదే పనిగా టీవీ చూస్తూ, సెల్ఫోన్లో నెట్ సర్ఫ్ చేస్తూ చిరుతిళ్లు ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తుంటారు. ఇలా రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్ఫుడ్ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది.
శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు అర్ధరాత్రి ఆహారం తినే వారిని జాగ్రత్తగా పరిశీలించి వివరాలను సేకరించారు. పడుకునే ముందు జంక్ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని కనుగొన్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా తగ్గిపోతుంది అని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే త్వరగా మానడానికి ప్రయత్నం చేయండి.