మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో పెట్రో కెమికల్ బాంబులు కలకలం సృష్టించాయి. మచిలీపట్నం సుకర్లబాద్లో ఒక ఇంటి గుమ్మం తలుపునకు, వంటగది తలుపునకు, అక్కడున్న ద్విచక్ర వాహనానికి పెట్రో కెమికల్ బాంబులు అమర్చి ఉన్నాయి.
తెల్లవారు జామున ఇంటి గుమ్మం తలుపు తీసేందుకు ప్రయత్నించిన మహిళ తలుపునకు తాడు కట్టి ఉండడం గమనించి లాగింది.
ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి తలువులు విరిగిపడ్డాయి. ఇంట్లోని వంటగది తలుపునకు కూడా పెట్రో బాంబు అమర్చినట్లు గుర్తించిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు, బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనానికి కూడా పెట్రో బాంబు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ టీం ఆ బాంబులను నిర్వీర్యం చేసింది.
కాగా , వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడే పెట్రో కెమికల్ బాంబులను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.