కరోనా సమయంలో ప్యారాసెటమాల్ 650 (డోలో 650) మాత్రలను సిఫార్సు చేసినందుకు వైద్యులకు సదరు ఉత్పత్తి సంస్థ మైక్రో ల్యాబ్స్ వెయ్యి కోట్ల రూపాయలు తాయిలాలుగా ఖర్చు చేసిందన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య గత నెలలో సుప్రీం కోర్టులో మైక్రోల్యాబ్స్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి స్టడీ చేసిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ (ఐపీఏ) .. డోలో – 650 తయారీ సంస్థ అయిన బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
వెయ్యి కోట్ల తాయిలాల ఆరోపణలపై ఇంతకు ముందే మైక్రో ల్యాబ్ సంస్థ స్పందించింది. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు గత నెలలో ర్కొన్నారు. కరోనా సమయంలో డోలో 650 మాత్రల మార్కెటింగ్ కోసం తాము వెయ్యి కోట్లు ఖర్చు చేశామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఎందుకంటే గత ఏడాది అత్యధికంగా అమ్మకం జరిగిన ఈ బ్రాండ్ ద్వారా తమకు రూ.350 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. రూ.350 కోట్ల ఆదాయానికి వెయ్యి కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తామే కాదు ఏ సంస్థ కూడా ఒక బ్రాండ్ కోసం అంత ఖర్చు చేయదని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే డోలో 650 తయారీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై స్పందించి అధ్యయనం చేసిన ఐపీఏ ఒక నివేదికను కేంద్ర రసాయనాల శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి ఒక నివేదిక సమర్పించింది. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రో ల్యాబ్స్ అనుసరించినట్లు తన నివేదికలో ఐపీఏ తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది ఐపీఏ. ఒక ఏడాదిలో ఒక్క డోలో 650 బ్రాండ్ పై తాయిలాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పడం అసమంజసమని ఐపీఏ పేర్కొంది.
Dolo 650 టాబ్లెట్ హానికరమా? డాక్టర్లు లంచాలు తీసుకొని బలవంతంగా సజెస్ట్ చేస్తున్నారు?