ఈ భూ ప్రపంచంలో వింతలు, విశేషాలు ఎన్నో వున్నాయి. ఈ ప్రకృతి లో అనేక రకాల జీవులు, జంతు జాలాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చూడటానికి విచిత్రంగానూ.. ఆశ్చర్యంగానూ ఉంటాయి. మరికొన్ని జీవులైతే అందంగానూ.. మరి కొన్ని భయంకరంగానూ ఉంటాయి. ఇటీవలి కాలంలో చాలా అరుదైన జీవులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఒడిశాలో పూర్తిగా పసుపు వర్ణంలో మెరిసి పోతున్న అరుదైన తాబేలు కనిపించింది.. అందరికి కనుల విందు చేసింది. అలాగే అంతరించి పోయాయి అనుకున్న ఓ ప్రత్యేక జాతి రాబందులు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే కనిపించాయి. ఇక శ్వేతనాగు (తెల్ల నాగుపాము) గురించి చాలా సార్లు వినడం తో పాటు.. అనేక పుస్తకాల్లో చదివే వుంటారు. కానీ చాలా మంది దానిని చూసి వుండరు. ఎందుకంటే ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చాలా ప్రత్యేకమైనవి కూడాను.
తాజాగా ఇలాంటి అరుదైన.. అత్యంత ప్రత్యేకమైన ఓ శ్వేతనాగు (తెల్లని నాగుపాము) కనిపించింది. ఈ అరుదైన దృశ్యం ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ పరిధిలో కనిపించింది. ఈ శ్వేతనాగు కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ.. నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు, వీడియోలలో శ్వేతనాగు తెల్లని రంగులో కనిపిస్తూ.. తెల్లని చారలతో తెగ మెరిసిపోతోంది.
సూరజ్ పూర్ జిల్లాలోని జయనగర్ గ్రామంలో స్థానికులు ఈ శ్వేతనాగు ను గుర్తించారు. స్థానికంగా ఉన్న బావిలో దీనిని చూసిన ప్రజలు భయాందోళనకు గురికావడంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పాములు పట్టే సత్యం కుమార్ ద్వివేది.. బావిలోకి దిగి చాలా చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు. ఇది చాలా అరుదైన పాము అనీ, అత్యంత విషపూరితమైనదని తెలిపాడు. ఇలా పాము తెల్లగా కనిపించడానికి అల్బునిజనే కారణమనీ, ఇది కోబ్రా జాతికి చెందినదని తెలిపాడు. ఈ అరుదైన శ్వేతనాగు ను మీరు చూసేయండి మరి ఈ ఫొటోలో ఉంది.